షాకింగ్‌ ఫ్రాడ్‌: సీనియర్‌ టెకీకి ఏకంగా రూ. 3.7 కోట్ల టోకరా

29 Nov, 2023 18:58 IST|Sakshi

ఛాన్స్‌ దొరికితే చాలు.. కాదు కాదు.. సందు దొరకబుచ్చుకుని మరీ సేబర్‌ నేరగాళ్లు  అక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా   దిగ్గజ ఐటీ కంపెనీకి చెందిన సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌కు టోకరా ఇచ్చి మూడు కోట్లు దోచేసిన వైనం కలకలం  రేపింది.  పోలీసుల అధికారుల  పేరుతో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని భయపెట్టి, బెదిరించి నిలువునా ముంచేశారు. నకిలీ పోలీసు స్టేషన్‌ సృష్టించిన ఈ షాకింగ్‌ ఘటన బెంగళూరులో  చోటు చేసుకుంది.

బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లోని ఇన్ఫోసిస్ ఉద్యోగి ఇచ్చిన పోలీసుల ఫిర్యాదు మేరకు సైబర్‌ నేరగాళ్లు అతడిని టార్గెట్‌గా చేసుకున్నారు.టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్),  సీబీఐ, ముంబై పోలీసుల అధికారుల అవతారమెత్తారు. మనీలాండరింగ్‌తో సహా పలు నేరాలకు పాల్పడ్డావంటూ తీవ్రంగా బెదిరించారు. అరెస్టుకు సిద్ధమని  హెచ్చరించారు. 

నవంబర్ 21న ఫోన్ చేసిన మోసగాళ్లు మనీలాండరింగ్‌తో పాటు అనేక నేరారోపణల కింద, అరెస్టు చేస్తామని బెదిరించారు. ట్రాయ్ అధికారిగా పరిచయం చేసుకున్న కేటుగాడు పేరు మీద ఉన్న సిమ్‌కార్డు అక్రమ ప్రకటనల కోసం వినియోగిస్తున్నారని  తెలిపాడు. షాక్ తిన్న ఇన్ఫోసిస్  టెకీ ఆ నంబర్ తనది కాదని చెప్పాడు.  ఆధార్‌ కార్డ్‌ మీద సిమ్‌ కార్డు రిజిస్టర్‌ అయిందన్నాడు. ఆ మరునాడు తాను ముంబై పోలీస్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారినని మరొకడు ఫోన్‌ ఏశాడు.  ఢిల్లీ, ముంబైలలో ఇదే కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇందులో  ఒకటి ముంబైలోని వకోలా పోలీస్ స్టేషన్‌లో, మరొకటి   ముంబైలో మనీలాండరింగ్ కేసులని మ్మ బలికాడు   తాను చెప్పిన మాట వినకుంటే ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తామని  బెదిరించారు.  

అంతేకాదు వీడియో కాల్ చేసిన మోసగాళ్ళు  అతడిని మరింత భయపెట్టారు. వీడియో కాల్‌లో నకిలీ  పోలీస్ స్టేషన్, నకిలీ పోలీసులు, ఐడి కార్డులు ..ఇలా పెద్ద తతంగమే చేశారు. ఫిర్యాదు (తప్పుడు) కాపీని  కూడా చూపించారు. దీంతో అయోమయం, గందరగోళానికి గురైన  టెకీ మోసగాళ్లు చెప్పినట్లే చేశాడు. తన ఖాతాలో ఉన్న రూ.3.7 కోట్లను మోసగాళ్లకు వివిధ ఖాతాలకు బదిలీ చేశారు. ఇదంతా నవంబర్ 21 నుంచి 23 మధ్య జరిగింది.

ఈ షాక్ నుంచి తేరుకున్నాక మోసపోయానని గ్రహించాడు.  దీంతో నవంబర్ 25న  పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. 3 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినందున కేసును క్రిమినల్ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (సీఐడీ)కి బదిలీ చేయనున్నట్లు పోలీసు వర్గాల సమాచారం. అక్రమార్కుల బ్యాంకు  ఖాతాలపై ఆరా తీస్తున్నారు.
 

మరిన్ని వార్తలు