డార్లింగ్ కాంబినేషన్ రిపీట్

21 Nov, 2015 08:24 IST|Sakshi
డార్లింగ్ కాంబినేషన్ రిపీట్

చెన్నై : ఒక చిత్రం విజయం సాధిస్తే ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడితో మళ్లీ చిత్రాలు తీయడానికి నిర్మాతలు ఆసక్తి చూపడం అన్నది సర్వసాధారణ విషయం. అలాంటి ఆసక్తే డార్లింగ్ చిత్ర దర్శక కథానాయకులపై నెలకొంది. యువ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన డార్లింగ్ చిత్రాన్ని శ్యామ్ ఆంటన్ దర్శకత్వం వహించారు. ఆ చిత్రం ఆనూహ్య విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో జీవీకి హీరోగా డిమాండ్ పెరిగిపోయింది.

వద్దంటే అవకాశాలు అన్నట్టుగా ఉందాయన పరిస్థితి. ఈ మధ్య విడుదలైన త్రిష ఇల్లన్నా నయనతార చిత్రం కలెక్షన్లను ఇరగదీసింది. ప్రస్తుతం బ్రూస్‌లీ అనే యాక్షన్ కథా చిత్రంలో నటిస్తున్న జీవీ ప్రకాశ్‌కుమార్ తదుపరి కెట్టవన్ ఇంద కార్తీ చిత్రంలో నటించనున్నారు. తాజాగా డార్లింగ్ చిత్ర దర్శకుడికి జీవీ పచ్చజెండా ఊపారు.

ఈ హిట్ కాంబినేషన్‌లో చిత్రం చేయడానికి పలువురు నిర్మాతలు ప్రయత్నించారు. డార్లింగ్ చిత్రాన్ని విడుదల చేసిన స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞానవేల్ రాజా కూడా ఈ కాంబినేషన్‌లో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారని, అయితే ఆయన తక్కువ పారితోషికం చెల్లిస్తాననడంతో అంతకంటే అధిక పారితోషికం అందిస్తానన్న లైకా ప్రొడక్షన్‌లో జీవీ హీరోగా శ్యామ్ ఆంటన్ చిత్రం చేయడానికి సిద్ధం అయ్యారన్నది తాజా సమాచారం. లైకా సంస్థ ఇంతకు ముందు విజయ్ హీరోగా కత్తి చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. త్వరలో సూపర్‌స్టార్‌తో శంకర్ దర్శకత్వంలో ఎందిరన్-2 ను అత్యంత భారీ స్థాయిలో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్న సంస్థా లైకానేనన్నది గమనార్హం.

మరిన్ని వార్తలు