సేలం : విద్యుదాఘాతంతో ఏనుగు వృతిచెందిన ఘటన తమిళనాడులోని ఈరోడ్ జిల్లా హాసనూర్ అటవీ డివిజన్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది. హాసనూర్ అటవీ డివిజన్ సమీపంలో అట్టపాడి అటవీ గ్రామముంది. ఆ గ్రామానికి చెందిన మణి(50) తన పొలంలో కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు. అటవీ జంతువుల నుంచి పంటను కాపాడుకునేందుకు పొలం చుట్టూ విద్యుత్ కంచె ఏర్పాటు చేశారు.
గురువారం రాత్రి అటువైపుగా వచ్చిన ఏనుగు ఆ కంచెను దాటే క్రమంలో విద్యుత్ షాక్కు గురై మరణించింది. ఉదయం ఈ విషయాన్ని గమనించిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. చట్ట విరుద్ధంగా డెరైక్ట్ కనెక్షన్తో విద్యుత్ కంచె ఏర్పాటు చేసి ఏనుగు వృతికి కారణమైన మణిని అరెస్టు చేశారు.