డోలాయమానమే ప్రభుత్వం ఏర్పాటయ్యేదెన్నడో?

14 Dec, 2013 05:10 IST|Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ ఏర్పాటుపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇచ్చిపుచ్చుకునే రాజకీయాలపై తమకు నమ్మకం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం తెలిపింది. లెఫ్టినెంట్ గవర్నర్‌ను శని వారం కలసి ప్రభుత్వ ఏర్పాటుపై తమ వైఖరిని లిఖితపూర్వకంగా తెలియజేస్తామని, అప్పటిదాకా ఏ విషయం వెల్లడించబోమని పేర్కొంది. ఏదిఏమైనప్పటికీ ప్రతిపక్షానికే పరిమితమవుతామంటూ పునరుద్ఘాటించనందువల్ల మైనారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే యోచనలో ఆప్ ఉందనే అభిప్రాయం బలపడింది.
 ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించడం కోసం శని వారం ఉదయం పదిన్నరకు తనతో సమావేశం కావాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) నజీబ్‌జంగ్... ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించారు. అయితే ఎల్‌జీకి ఏమిచెప్పాలనే విషయంపై చర్చించడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు శుక్రవారం ఉదయం అరవింద్ నివాసంలో సమావేశమయ్యారు.  ఈ సమావేశానికి ముందు ఆప్ నేత కుమార్ బిశ్వాస్ విలేకరులతో మాటాడుతూ తాము ఏపార్టీకి  మద్దతు ఇవ్వబోమని, అదే సమంయలో స్వీకరించబోమని అంటూనే ప్రభుత్వ ఏర్పాటుకుగల అన్ని అవకాశాలను పరిశీలిస్తామని ప్రకటించారు.

 దీంతో  ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఆప్ మెత్తబడిందనే ఊహాగానాలు వ్యాపిం చాయి. కాంగ్రెస్, బీజేపీ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసే విషయాన్ని పార్టీ చర్చిస్తోందని కుమార్  బిశ్వాస్ తెలపడంతో ఆప్ మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేయొచ్చన్న అభిప్రాయం కలిగింది. కాగా ప్రభుత్వ ఏర్పాటుపై అరవింద్ నివాసంలో సుదీర్ఘ సమావేశం జరిపినప్పటికీ ఆ పార్టీ నేతలు తుది నిర్ణయమేమిటో వెల్లడించలేదు. లెఫ్టినెంట్ గవర్నర్‌తో సమావేశం తర్వాతే తమ వైఖరిని వెల్లడిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పాటుగురించి చర్చించడం కోసం శనివారం ఉదయం తనను కలవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్... కేజ్రీవాల్‌ను లాంఛనంగా ఆహ్వానించారని ఆప్ నేత మనీష్ సిసోడియా చెప్పారు. అందువల్ల అరవింద్ ఎల్‌జీని కలుస్తారని, ప్రభుత్వ ఏర్పాటుగల అవకాశాలను ఆయన ముందుంచుతారని ఆప్ నేత యోగేంద్రయాదవ్ చెప్పారు.

తమకు మెజారిటీ లేదని, శాసనసభలో తమది అతి పెద్ద రాజకీయ పార్టీ కూడా కాదని అన్నారు. తాము ఇచ్చిపుచ్చుకునే రాజకీయాలకు అంగీకరించబోమని, తమ పార్టీ మౌలిక సిద్ధాంతాలలో ఎటువంటి మార్పూ లేదన్నారు. ప్రభుత్వ  ఏర్పాటుపై తమ వైఖరిని ఎల్‌జీతో సమావేశం తరువాతే బయటపెడతామన్నారు. ఏదిఏమైనప్పటికీ ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధంగా ఉన్నామనే మాటను ఆయన పునరుద్ఘాటించ నందువల్లమైనారిటీ ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేయొచ్చని రాజకీయ పండితులు అంటున్నారు.

మరిన్ని వార్తలు