సత్యభామదాస్ బీజూ. ఊహు! ఈ పేరుతో ఈయన్ని గుర్తుపట్టలేం. ఎస్.డి.బీజూ అని చూడండి. ‘ఓ.. ఆయనా’ అంటారు. బీజూ ఉభయచర శాస్త్రవేత్తగా ప్రసిద్ధుడు. అంటే... నీళ్లలోనూ, నీళ్ల బయటా పరిశోధనలు చేస్తాడని కాదు. కప్పల మీద అధ్యయనం చేస్తుంటారు. యాంఫీబియన్ బయాలజిస్ట్ అన్నమాట. ఇంకా ఇతడు... వన్యప్రాణి పరిరక్షకుడు, ఢిల్లీ యూనివర్శిటీలో ‘సిస్టమేటిక్స్ ల్యాబ్’కి హెడ్డు. ఇటీవల ఈయన కేరళ వళచల్ అడవుల్లో కొత్త రకం కప్పల్ని కనిపెట్టాడు!
వాటి శాస్త్రీయనాయం ‘నిట్చిబాట్రేషియన్ అథిరపల్లియెన్సిస్’. అతిరపల్లి చీకటి కప్పలు... అనేది అశాస్త్రీయనామం. నిశితంగా పట్టిచూస్తే తప్ప కనిపించనంత సైజులో ఉంటాయి ఈ కప్పలు! ఒకవేళ కనిపించినా, అవి ఉన్న చోట రాయిలోనో, రప్పలోనో కలిసిపోతాయి. ఈ కారణంగానే ఇంతకాలం ఇవి బయాలజిస్టుల దృష్టికి రాలేదు. ఈ కొత్తరకం కప్పలు దొరికినప్పటి నుంచి బీజూ మహా ఉత్సాహంగా డ్యూటీకి వెళ్లివస్తున్నారట. త్రిచూరు జిల్లా అతిరపల్లి జలపాతానికి దిగువన పాకుడురాళ్లపై బీజూ కొద్ది రోజుల క్రితమే ఈ కప్పల్ని కనిపెట్టారు.