నారాయణపురం: తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగు చూసింది. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం సర్వేల్లోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న శేఖర్(16) అనే విద్యార్థి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
కళాశాల సమీపంలోని మల్లారెడ్డిగూడెం గ్రామ శివారు వ్యవసాయబావి వద్ద విద్యార్థి మృతదేహం పడి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడు సూర్యాపేట జిల్లా దోసపాడు గ్రామానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.