హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ గృహనిర్మాణంపై ప్రకటన చేశారు. లబ్ధిదారులు ఎక్కువగా ఉంటే డబుల్ బెడ్ రూం ఇళ్లను లాటరీ పద్దతిలో కేటాయిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ వెల్లడించారు. పేదలకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే తమ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తుందని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఎండగట్టారు. 2004 నుంచి 2014 మధ్య జరిగిన ఇందిరమ్మ గృహ నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై 225 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. 1,95,519 మంది అనర్హులు ఇళ్లు పొందినట్లు తేలిందని కేసీఆర్ వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపి 1,19,000 మంది బోగస్ లబ్దిదారులను గుర్తించామన్నారు.