విడాకులు తీసుకున్న బిచ్చగాడు-2 నటి

2 Dec, 2023 14:50 IST|Sakshi

కోలివుడ్‌లో ప్రముఖ నటిగా కొనసాగుతున్న షీలా రాజ్‌కుమార్ తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా ప్రకటించింది.కోలివుడ్‌లో షీలా రాజ్‌కుమార్‌ చాలా చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ద్రౌపది, టూలెట్‌, మండేలా, ఇటీవల విడుదలైన జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. అరుణ్ విజయ్ నటించిన 'ఆరదు చినమ్' సినిమాతో ఆమె తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత 'టూ లెట్' సినిమాలో నటించింది. ఈ చిత్రం ద్వారా ఆమెకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఆ చిత్రానికి జాతీయ అవార్డు కూడా దక్కడం విషేశం. ఆ తర్వాత తమిళ, మలయాళ చిత్రాల్లో భారీగా అవకాశాలు వచ్చాయి.

మండేలా సినిమాలో పోస్టల్ ఆఫీసర్ పాత్రలో నటించి అభిమానుల మన్ననలు పొందింది. ఆ తర్వాత తన నటనకు స్కోప్‌ ఉన్న మంచి పాత్రల్లో నటించడంపై దృష్టి సారిస్తోంది. ఈ ఏడాది దీపావళికి విడుదలైన కార్తీక్ సుబ్బరాజ్ జిగర్తాండ డబుల్ ఎక్స్‌లో ఎస్‌.జే సూర్య సరసన ఎక్స్‌ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించింది. శివకార్తికేయన్‌తో  నమ్మ వైట్టుప్ పిళ్లై, అసురవతం, పెట్టైకలి వెబ్ సిరీస్, జ్యోతితో కనిపించిన షీలా బిచ్చగాడు 2 చిత్రంలో విజయ్‌ ఆంటోని చెల్లెలు రాణిగా మెప్పించింది. మోహన్ జి దర్శకత్వం వహించిన ద్రౌపది చిత్రంలో ఆమె రిచర్డ్ రిషి సరసన నటించింది. ఈ సినిమా కులాల మధ్య విభేదాలను చూపిస్తూ తెరకెక్కింది. దీంతో తమిళనాట వివాదాన్ని సృష్టించింది. పెటైకాలి అనే వెబ్ సిరీస్‌లో ఆమె జల్లికట్టు ఎద్దును పెంచే మహిళగా నటించింది.

కోలీవుడ్‌లో నటన శిక్షణ పాఠశాలను నడుపుతున్న చోళన్‌తో ఆమె వివాహం జరిగింది. తాజాగా వివాహబంధానికి ఫుల్‌స్టాప్‌ పెడుతున్నట్లు ఆమె ప్రకటించింది. తన వైవాహిక బంధాన్ని ఎందుకు వదులుకుంటుందో అనే కారణాన్ని ఆమె తెలపలేదు. చివరగా ధన్యవాదాలు చోళన్‌ అంటూ తన భర్త పేరు చేర్చి  పోస్ట్ చేసింది.పరిశ్రమలోని వ్యక్తులు వరుసగా విడాకులు తీసుకోవడం అభిమానులను షాక్‌కు గురిచేస్తుండడం గమనార్హం.

మరిన్ని వార్తలు