కోర్టుకు హాజరైన హీరో ధనుష్‌

28 Feb, 2017 11:36 IST|Sakshi
కోర్టుకు హాజరైన హీరో ధనుష్‌
చెన్నై: నటుడు ధనుష్‌ మంగళవారం ఉదయం మధురై కోర్టుకు హాజరయ్యారు. మదురై జిల్లా మేలూర్‌ గ్రామానికి చెందిన కదిరేశన్, మీనాక్షి దంపతులు ధనుష్‌ తమ కుమారుడని పేర్కొంటూ మదురై కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అందుకు బదులుగా నటుడు ధనుష్‌ సదరు దంపతులు పేర్కొన్న అంశాల్లో నిజాలు లేవనీ, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా మరో పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసు విచారణలో ఉంది. ఈ కేసుకు సంబంధించిన ఆధారాలను ప్రవేశ పెట్టాలని ఇరువురి పిటిషన్‌ దారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
దీంతో వాళ్లు కోర్టుకు అందజేసిన పత్రాలను గతవారం జస్టిస్ జి.చోక్కాలింగం పరిశీలించారు. అయితే కధిరేశన్ దంపతులు కోర్టులో ప్రవేశపెట్టిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొన్నట్లు ఉండగా, ధనుష్ తరఫు లాయర్ సమర్పించిన టీసీలో పుట్టు మచ్చలు పేర్కొనలేక పోవడం గమనార్హం. దీంతో బర్త్ మార్క్స్ (పుట్టుమచ్చలు) వెరిఫికేషన్ కోరకు ఈ నెల 28 లోగా కోర్టుకు హాజరు కావాలని మదురై కోర్టు సూచించింది. ఈ నేపధ్యంలో కోర్టు ఆదేశాల మేరకు ధనుష్‌ మంగళవారం ఉదయం మధురై కోర్టుకు హాజరయ్యారు.
 
 
మరిన్ని వార్తలు