టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి | Sakshi
Sakshi News home page

టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి

Published Tue, Feb 28 2017 11:43 AM

టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి - Sakshi

అమరావతి: అధికార టీడీపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చిచ్చురాజేసింది. పార్టీని నమ్ముకున్నవారికి న్యాయం జరగలేదని ఏపీలోని చాలా జిల్లాల్లో టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు వారిని బుజ్జగిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో శత్రుచర్ల విజయరామరాజుకు టికెట్ ఇవ్వడంపై అప్పలనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేసేందుకు అప్పలనాయుడు సిద్ధంకాగా.. ఎంపీ రామ్మోహన్ నాయుడు, జిల్లా ఇంఛార్జి మంత్రి పరిటాల సునీత ఆయన్ను బుజ్జగిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావుకు టికెట్‌ ఇవ్వడాన్ని బొడ్డు భాస్కరరామారావు వ్యతిరేకిస్తున్నారు. బొడ్డు భాస్కర రామారావు రెబెల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతుండగా.. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి పుల్లారావు ఆయన్ను బుజ్జగిస్తున్నారు. పార్టీని నమ్ముకుంటే తనను మోసం చేశారని బొడ్డు భాస్కర రామారావు ఆరోపించారు.

ఇక పశ్చిమగోదావరి, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లోనూ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక టీడీపీలో అసమ్మతి సెగ రాజేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్థసారధి, అంబికా కృష్ణ అసంతృప్తి వ్యక్తం చేయగా.. నెల్లూరు జిల్లాలో వాకాటి నారాయణరెడ్డికి టికెట్ ఇవ్వడాన్ని ఆనం సోదరులు, ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యతిరేకిస్తున్నారు. చిత్తూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కలేదు. టికెట్ ఇస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లాలో దీపక్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక కర్నూలు జిల్లాలో శిల్పా చక్రపాణిరెడ్డిని మీనాక్షి నాయుడు, ఫరూఖ్ వ్యతిరేకిస్తున్నారు.
 

Advertisement
Advertisement