రోడ్ల అభివృద్ధి కోసం రూ.2500 కోట్లు

18 Jan, 2014 06:19 IST|Sakshi

సింధనూరు టౌన్/గంగావతి,  న్యూస్‌లైన్ : రాష్ట్రంలో అధ్వాన్న స్థితిలో ఉన్న 5 వేల కి.మీ  రోడ్లను రూ.2500 కోట్లతో అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ప్రజాపనుల శాఖా మంత్రి హెచ్‌సీ మహదేవప్ప తెలిపారు. సింధనూరులోని ఆదర్శ కాలనీలో ఎస్‌ఎఫ్‌సీ పథకం కింద రూ.3 కోట్లతో చేపట్టిన రోడ్లు, డ్రెయినేజీ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు.

 ఇప్పటికే రాయచూరు జిల్లాకు రూ.200 కోట్లు అధిక నిధులు కేటాయించినట్లు తెలిపారు.  సింధనూరు అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి యూజీడీ పథకం కోసం రూ. 50 కోట్లు కేటాయించారన్నారు. విశ్వ బ్యాంక్ పథకం కింద  రూ.5 వేల కోట్లతో తాగునీటి సౌకర్యం కల్పించామన్నారు. రాష్ట్రంలో నీటిపారుదల పథకాలకు రూ.10 వేల కోట్లు కేటాయించారని, వీటితో వ్యవసాయ రంగానికి చేయూత నిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు హంపనగౌడ బాదర్లి, ప్రతాప్‌గౌడ పాటిల్, జిల్లా పంచాయతీ అధ్యక్షులు లలితమ్మ, నగరసభ అధ్యక్షులు సయ్యద్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు.


 అనంతరం గంగావతిలోని సర్య్కూట్ హౌస్‌లో విలేకరులతో మాట్లాడుతూ...  రాష్ట్రంలో కేఆర్‌డీసీ ద్వారా ఈ ఏడాది 1324 కి.మీ నిర్మాణాలు చేపడుతున్నట్లు వివరించారు. అలాగే కేఆర్‌డీసీ ద్వారా ఏడాదికి 200 వంతెనల నిర్మాణాలను చేపట్టే ప్రణాళికను రూపొందించి అమలు చేస్తున్నామన్నారు. ఆనెగొంది వంతెనను కడెబాగిలు వద్దనే నిర్మిస్తామని, ఇందుకోసం రూ.32 కోట్లు కేటాయించామన్నారు.

ఫిబ్రవరి నుంచి వంతెన పనులు ప్రారంభిస్తామని చెప్పారు.   అంతకు ముందు మం త్రిని యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్‌ఎస్. భరత్, నేతలు జోగద హనుమంతప్ప నాయక్,  చిలుకూరి విజయలక్ష్మి రామకృష్ణ, కుంటోజి మరియప్ప, బొజ్జప్ప, రుద్రేశ్, కొల్లి గంగాధర్ మంత్రికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు.

>
మరిన్ని వార్తలు