హైదరాబాద్‌లో బీఎండబ్ల్యూ కారు బీభత్సం

17 Dec, 2023 08:51 IST|Sakshi

నాగోలు: ఎల్‌బీనగర్‌లోని చింతల్‌కుంటలో బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చి ముందున్న కారుతో పాటు మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టి.. రోడ్డుపై ఉన్న నలుగురు వ్యక్తులను ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడిక్కడే మృతి దుర్మరణం చెందారు. మరో ముగ్గురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం రాత్రి ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవకీ నందన్‌ అనే వ్యక్తి తన బీఎండబ్లూ కారులో దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వైపు వెళ్తున్నాడు.

 ఎల్‌బీనగర్‌ చింతల్‌కుంట వద్ద పెట్రోల్‌ బంక్‌ సమీపంలో అతివేగంగా దూసుకొచ్చి రోడ్డు పక్కన ఉన్న వ్యాగనార్‌ కారు ఢీకొట్టాడు. అక్కడే ఉన్న మరో రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని.. రోడ్డు పక్కనే ఉన్న నల్లగొండ జిల్లాకు చెందిన మల్లేష్‌ (50)తో పాటు నగరానికి చెందిన పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతమ్‌లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో మల్లేష్‌ తీవ్ర గాయాలతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. పవన్‌కుమార్, జన్నారెడ్డి, శశిప్రీతంరెడ్డిలకు గాయాలయ్యాయి.

 సమాచారం తెలియగానే ఎల్‌బీనగర్‌ పోలీస్‌లు ఘటనా స్థలానికి చేరుకుని మల్లేష్‌ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన బీఎండబ్ల్యూ కారుపై ఓవర్‌ స్పీడ్‌కు సంబంధించి ఇప్పటికే చాలా చలాన్‌లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.   

కూతుర్ని చూసేందుకు వచ్చి.. 
చింతలకుంటలో ఉన్న కూతుర్ని చూసేందుకు మల్లేష్‌ నల్లగొండ జిల్లా చిట్యాల నుంచి వచ్చి బస్సు దిగాడు. సరస్వతీనగర్‌లోని తన కూతురి ఇంటికి వెళ్లేందుకు రోడ్డుపై నిల్చుని ఉండగా..ఈ ప్రమాదం జరిగింది. ఈ మేరకు మల్లేష్‌ కుమారుడు వినయ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

>
మరిన్ని వార్తలు