సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమ పెళ్లి.. విషాదం

17 May, 2017 19:45 IST|Sakshi
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ప్రేమ పెళ్లి.. విషాదం

అన్నానగర్‌: కుమారుడు ప్రేమ వివాహం చేసుకోవటం ఇష్టంలేని ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. చెన్నైలో జరిగిన ఈ ఘటన వివరాలివీ.. నగరంలోని తేని ప్రాంతానికి చెందిన జయభారతి(55) రిటైర్డు టీచర్‌. ఈమె భర్త సుబ్బురాజ్‌ కొన్నేళ‍్ల క్రితమే మృతి చెందారు. కుమార్తెకు వివాహం కాగా, కుమారుడు మనోజ్‌(28) ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మనోజ్‌ తమ బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విషయం తెలిసిన జయభారతి అభ్యంతరం తెలిపింది. కానీ, తల్లి మాటను లెక్కచేయకుండా గత 12వ తేదీన మనోజ్‌ ప్రేమించిన అమ్మాయిని చెన్నైలో వివాహం చేసుకున్నాడు.

వివాహం జరిగిన తర్వాత భార్య తీసుకుని మంగళవారం ఉదయం తేని ప్రాంతంలోని తల్లి వద్దకు వచ్చాడు. తలుపు లోపల గడియపెట్టి ఉండటంతో మనోజ్‌ ఎంత కొట్టినా తెరవలేదు. దీంతోపాటు ఇంటి లోపలి నుంచి దుర్వాసన వచ్చింది. పోలీసులకు మనోజ్‌ సమాచారం అందించటంతో వారు వచ్చి తలుపులు పగులగొట్టి లోపల చూడగా జయభారతి ఉరి వేసుకుని కనిపించింది. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో ఆమె పది రోజుల క్రితమే మృతి చెంది ఉంటుందని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు