Ranjana Naachiyar: విద్యార్థులను కొట్టిన నటి అరెస్ట్..!

5 Nov, 2023 07:31 IST|Sakshi

కోలీవుడ్ నటి రంజనా నాచ్చియార్‌ మరోసారి వార్తల్లో నిలిచింది. బస్సు ఫుట్‌బోర్డులో వేళాడుతూ వెళ్తున్న విద్యార్థులపై దాడి చేశారంటూ ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో కుండ్రత్తూరు పోలీసులు శనివారం ఆమెను అరెస్టు చేశారు. అయితే సాయంత్రానికే ఆమెకు శ్రీపెరంబదూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో బెయిల్‌పై నటి రంజనా విడుదలయ్యారు. 

అసలే జరిగిందంటే..

బస్సు ఫుట్‌బోర్డులో వేళాడుతూ వెళ్తున్న విద్యార్థులపై దాడి చేయడమే కాకుండా, కండెక్టర్‌, డ్రైవర్‌లను ఆమె దూషించిన వీడియో వైరల్‌ కావడంతోనే అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.  చైన్నె నగరంలో పాఠశాల విద్యార్థులు, కళాశాలల విద్యార్థులు ఫుట్‌ బోర్డు ప్రయాణం చేయడం అలవాటుగా మారింది. ఈ పరిస్థితులలో బీజేపీ మహిళా నేత, సినీ సహాయ నటి రంజనా నాచ్చియార్‌ విద్యార్థులను హెచ్చరిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది.

చైన్నె పోరూర్‌ నుంచి కుండ్రత్తూరు వైపుగా వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సులో అనేక మంది విద్యార్థులు ఫుట్‌పై వేలాడుతూ ప్రయాణం చేస్తుండటాన్ని రంజనా నాచ్చియార్‌ గుర్తించారు. తన వాహనంలో ఆ బస్సును ఛేజింగ్‌చేసి మరీ అడ్డుకున్నారు. ఫుట్‌ బోర్డుపై వేలాడుతున్న విద్యార్థులను దూషిస్తూ, చెంపలు పగల కొట్టే విధంగా కొడుతూ బలవంతంగా కిందకి దించేశారు. అంతటితో ఆగకుండా డ్రైవర్‌, కండెక్టర్లతో గొడవకు దిగారు. ఫుట్‌బోర్డులో విద్యార్థులు వేలాడుతుంటే చోద్యం చూస్తారా..? అని తన దైన శైలిలో దూషణలో ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ఈ వీడియో వైరల్‌ కావడంతో వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. విద్యార్థులను కొట్టడం, దూషించడం, డ్రైవర్‌, కండెక్లర్లతో గొడవ పడడం వంటి అంశాలను పరిగణించి ఆమైపె ఐదు సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. రంజనా నాచియార్ బిల్లా పండి, సుకుమారిన్ శబదం, మయం లాంటి కోలీవుడ్ చిత్రాల్లో నటించారు. 

మరిన్ని వార్తలు