మహిళా పోలీసుపై అత్యాచారం: ఎస్‌ఐపై కేసు

8 Sep, 2016 11:09 IST|Sakshi

చెన్నై: తిరునెల్వేలి జిల్లాలో మహిళా పోలీసును పెళ్లి పేరుతో మోసం చేసి ఆమెపై అత్యాచారం జరిపిన సబ్‌ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైంది. తిరునెల్వేలి జిల్లా పొపట్టలైకు చెందిన రామలక్ష్మి (29) మహిళా పోలీసు అయిన ఈమె ఆలంకులం సమీపంలోగల సీద పర్సనల్లూర్‌ పోలీసుస్టేషన్‌లో విధులు నిర్వహిస్తోంది. ఈమె గత 2014లో కేసులకు సంబంధించిన ఫైల్స్‌ విషయంలో తరచూ ఆలంగులం డీఎస్పీ కార్యాలయానికి వెళుతుండేది.

ఆ సమయంలో అదే పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న వీరకోరలంపుదూర్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ అరుమై నాయగన్‌ (35)కు, రామలక్ష్మికి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో అరుమై నాయగన్‌ తనకు అప్పటికే వివాహం జరిగిన విషయాన్ని దాచి రామలక్ష్మిని పెళ్లి చేసుకుంటానని ఆశలు కల్పించి ఆమెపై అత్యాచారం జరిపినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గత కొన్ని నెలల క్రితం అరుమై నాయగన్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పరీక్ష రాసి చెన్నైలో గల పోలీసు ట్రైనింగ్‌ కళాశాలకు వెళ్లాడు. దీంతో అతడు రామలక్ష్మితో మాట్లాడడం తగ్గించాడు. ఈ క్రమంలో అరుమైనాయగన్‌కు వివాహం జరిగిన విషయం తెలిసి రామలక్ష్మి తనకు న్యాయం చేయాలని అరుమైనాయగన్‌ వద్ద అడిగింది. దీంతో అతడు ఆమెను బెదిరించడంతో రామలక్ష్మి ఈ విషయాన్ని అంబై మహిళా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు ఇన్‌స్పెక్టర్‌ నాగదేవి, పోలీసులు విచారణ చేసి సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ అరుమై నాయగన్‌పై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు