గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌లపై స్పెషల్‌ ఆఫర్‌

20 Sep, 2017 08:43 IST|Sakshi
గెలాక్సీ ఎస్‌8, ఎస్‌8 ప్లస్‌లపై స్పెషల్‌ ఆఫర్‌
సాక్షి, న్యూఢిల్లీ : పండుగ సీజన్‌ మొదలైంది. కంపెనీలన్నీ వరుసబెట్టి తమ ఉత్పత్తుల ధరలను భారీగా తగ్గించేస్తున్నాయి. ఈ-కామర్స్‌ కంపెనీలైతే ఏకంగా భారీ భారీ డిస్కౌంట్లతో మెగా సేల్స్‌కు తెరలేపాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ల రారాజు శాంసంగ్‌ కూడా 'నవ్‌రాత్ర స్పెషల్‌ ఆఫర్‌' ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా తన గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై ధరను తగ్గించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను 4వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో లాంచింగ్‌ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్‌8, 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్‌బ్యాక్‌ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది.
 
అయితే ఈ తగ్గించిన ధరలు ఇంకా కంపెనీ సొంత ఆన్‌లైన్‌ స్టోర్‌లో అప్‌డేట్‌ కాకపోవడం గమనార్హం. ఈ ఫోన్లు ఏప్రిల్‌లో భారత్‌లో లాంచ్‌ అయిన తర్వాత చేపట్టిన ఈ కోత, అత్యంత ముఖ్యమైన ధర తగ్గింపుగా కంపెనీ తెలిపింది. గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌కు రెండు భిన్నమైన విధానాల్లో ధరల తగ్గింపు శాంసంగ్‌ చేపట్టింది. గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌పై కేవలం రూ.1000 ధర మాత్రమే తగ్గించి, 64,900 రూపాయలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ధరల తగ్గింపు ఫెస్టివ్‌ సీజన్‌కు కాస్త ముందుగా కంపెనీ చేపట్టింది. అంతేకాక త్వరలోనే శాంసంగ్‌ కొత్త ఫోన్‌ గెలాక్సీ నోట్‌ 8 మార్కెట్‌లోకి రాబోతుంది. ఈ ఫోన్‌ గతవారమే భారత్‌లో విడుదలైంది. ప్రస్తుతం భారత్‌లో దీని ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌21 నుంచి సరుకు రవాణా అవుతోంది. గెలాక్సీ నోట్‌ 8 ధర 67,900 రూపాయలు. 
మరిన్ని వార్తలు