ఇందులో 18.8% పాజిటివ్ కేసులు
కొత్తగా 1,597 కేసులు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రెండు లక్షలు దాటాయి. బుధవారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,08,666 శాంపుల్స్ పరిశీలించగా ఇందులో 1,69,324 శాంపుల్స్ నెగెటివ్ రాగా... 39,342 శాంపుల్స్ పాజిటివ్గా వచ్చాయి. పరీక్ష లు చేసిన శాంపుల్స్లో పాజిటివ్ శాతం ఏకంగా 18.85 ఉంది. జాతీయ స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు 1.24 కోట్లు చేయగా... ఇందు లో 9.36 లక్షలు పాజిటివ్గా తేలింది. ఈ లెక్కన 7.5 శాతం పాజిటివ్ నిష్పత్తి ఉండగా... రాష్ట్రంలో మాత్రం రెండున్నర రెట్లు అధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసుల్లో 25,999 మంది కోలుకున్నారు. రికవరీ 66 శాతంగా ఉంది.
కొత్త కేసులు 1,597
రాష్ట్రంలో కొత్తగా 1,597 మందికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మీడియా బులిటెన్లో వెల్లడించింది. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 13,642 శాంపుల్స్ పరిశీలించగా ఇందులో 12,045 శాంపుల్స్ నెగిటివ్గా రిజల్ట్ వచ్చింది. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది కరోనా వైరస్ ప్రభావంతో మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 386కు చేరింది. కొత్తగా నమోదైన పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలోనే 796 ఉన్నాయి. రంగారెడ్డిలో 212, మేడ్చల్లో 115, సంగారెడ్డిలో 73, నల్గొండలో 58, వరంగల్ అర్బన్లో 44, కరీంనగర్లో 41, కామారెడ్డి 30, సిద్దిపేట 27, మంచిర్యాల 26, మహబూబ్నగర్ 21, పెద్దపల్లి 20, మెదక్ 18, భూపాలపల్లి 15, సూర్యాపేట్ 14, భువనగిరి, నిజామాబాద్ 13 చొప్పున, జనగామ 8, కొత్తగూడెం 7, ఖమ్మం, సిరిసిల్లలో 6 చొప్పున, మహబుబాబాద్, నారాయణపేట్, వికారాబాద్, నాగర్కర్నూల్, వననర్తి జిల్లాల్లో 5 చొప్పున, ములుగు, గద్వాల జిల్లాల్లో 4 చొప్పున, ఆదిలాబాద్లో ఒక పాజిటివ్ కేసు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.