దేవాదాయశాఖలో ఉద్యోగుల కొరత!

12 Jul, 2015 01:22 IST|Sakshi

♦ జిల్లా కమిషనర్ సైతం ఇన్‌చార్జియే
♦ గోదావరి పుష్కరాలకు ఉద్యోగుల సమస్య
♦ తాత్కాలిక ఉద్యోగుల నియామకం జరిగేనా
 
 నిజామాబాద్‌కల్చరల్ : జిల్లా దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయంలో ఉద్యోగుల కొరత వెంటాడుతోంది. దశాబ్దాలపాటు ఈ శాఖలో రెగ్యులర్ పోస్టుల భర్తీ జరగక, పదవీ విరమణ పొందిన వారి స్థానంలో కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం ఉన్న ఉద్యోగులు అదనపు పనిభారంతో పడరాని పాట్లు పడుతున్నారు. 14 నుంచి 25 వరకు 12 రోజులపాటు జరుగనున్న గోదావరి పుష్కరాల నేపథ్యంలోనైనా ఉద్యోగుల నియామకాలు చేపట్టక పోవడంపై చొరవ చూపాల్సిన అవసరం ఉందని ఆ శాఖ ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి.

ఏళ్ల నుంచి పదవీ విరమణ పొందిన స్థానంలో కొత్త వారిని బదిలీపై ఆ శాఖ కమిషనర్ కార్యాలయం నియమించకపోవడంతో ఉన్న ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం ఈ కార్యాలయంలో ఉండాల్సిన రెగ్యులర్ జిల్లా కమిషనర్  పోస్టుతోసహా మిగితా ఉద్యోగుల ఖాళీలున్నాయి. గత కొన్నేళ్లుగా మెదక్-నిజామాబాద్ జిల్లాలకు కలపి జిల్లా ఇన్‌చార్జి కమిషనర్ ఒకరే ఉండగా గత  ఏడాదిన్నర నుంచి హైదరాబాద్ ప్రధాన కార్యాలయం నుంచి జిల్లా దేవాదాయ,ధర్మదాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్‌గా సోమయ్య బాధ్యతలు చేపట్టారు.

జిల్లా ఇన్‌చార్జిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయాన్ని చక్కదిద్దడంతోపాటు అస్తవ్యస్తంగా ఉన్న కార్యాలయంలోని కొందరు ఉద్యోగుల పనితీరును, జిల్లాలోని శాఖ పరిధిలోకి వచ్చే దేవాలయాల కోర్టు వివాదాల పరిష్కారంపై ప్రత్యేక శ్రద ్ధ కనబరుస్తున్నారు. ప్రస్తుతం జిల్లా కేంద్రంలో గల దేవాదాయ, ధర్మదాయ శాఖ కార్యాలయంలో రెగ్యులర్ కమిషనర్ పోస్టుతోపాటు ఒక సీనియర్ అసిస్టెంట్ పోస్టు రెండేళ్ల నుంచి ఖాళీగా ఉన్నారుు. ముగ్గురు ఇన్‌స్పెక్టర్లకుగాను 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్‌లకుగాను రెండు పోస్టులు, టైపిస్టు పోస్టు, రికార్డు అసిస్టెంట్ పోస్టు, రెండు అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఎప్పుడు ఊపుతుందోగాని అప్పటి వరకు తాత్కాలిక ఉద్యోగులనైనా నియమిస్తే ‘గోదావరి పుష్కరాలు’ సవ్యంగా సాగేందుకు అవకాశం ఉంటుందని, ప్రభుత్వం చొరవ చూపాలని ఉద్యోగవర్గాలు ప్రభుత్వాన్ని కోరుతున్నారుు.

>
మరిన్ని వార్తలు