సికింద్రాబాద్‌ టు నాగ్‌పూర్‌... సెమీ హైస్పీడ్‌ కారిడార్‌కు ఓకే!

16 Jun, 2019 02:48 IST|Sakshi

త్వరలో నివేదిక సమర్పించనున్న రష్యన్‌ రైల్వేస్‌

ఈ కారిడార్‌లో గంటకు 180 కి.మీ. వేగం సాధ్యమేనన్న ఇంజనీర్లు

ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమన్న రష్యా

కిర్గిస్తాన్‌లో మోదీ–పుతిన్‌ చర్చల్లో ప్రస్తావన

కారిడార్‌ సిద్ధమైతే సగానికి తగ్గనున్న ప్రయాణ సమయం

584 కి.మీ. దూరం దాదాపు 4 గంటల్లోనే చేరే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సెమీ హైస్పీడ్‌ రైలు భాగ్యం హైదరాబాద్‌కు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ మధ్య ఈ రైలు పరుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది. దాదాపు మూడేళ్ల క్రితం ఈ కారిడార్‌ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసిన రష్యా రైల్వే కంపెనీ తాజాగా ఈ కారిడార్‌లో 180 కి.మీ. వేగంతో రైళ్ల ప్రయాణం సాధ్యమేనని తేలుస్తూ త్వరలో నివేదిక సమర్పించనుంది. అలాగే ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు సిద్ధమని రష్యన్‌ రైల్వే సమ్మతి వ్యక్తం చేసినట్టు సమాచారం. ప్రధాని నరేంద్ర మోదీ కిర్గిస్తాన్‌ పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం చర్చకు వచ్చినట్లు రైల్వే వర్గాలు పేర్కొంటున్నాయి. భారత్‌లో సెమీ హైస్పీడ్‌ ప్రాజెక్టు చేపడుతున్నందుకు సంతోషంగా ఉందని స్వయంగా పుతిన్‌ ప్రస్తావించినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

సగానికి తగ్గనున్న సమయం... 
సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ మధ్య దూరం 584 కి.మీ. ఇంత దూరం ప్రయాణానికి ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌లకు దాదాపు 9 గంటల సమయం పడుతోంది. ప్రస్తుతం పరుగుపెడుతున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ల గరిష్ట వేగం గంటకు 120 కి.మీ., కానీ రైళ్ల ట్రాఫిక్, ట్రాక్‌ల పరిస్థితి, సిగ్నలింగ్‌ వ్యవస్థ వల్ల అవి సగటున 75 కి.మీ. వేగాన్ని మించడంలేదు. దీంతో ప్రధాన కారిడార్లలో సెమీ హైస్పీడ్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని దాదాపు నాలుగేళ్ల క్రితం రైల్వేశాఖ నిర్ణయించింది. బుల్లెట్‌ రైలు ఇప్పట్లో సాధ్యం కానందున గంటకు 200 కి.మీ. వేగంతో ప్రయాణించేలా సెమీ బుల్లెట్‌ రైళ్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం తొలుత ఐదు కారిడార్లను ఎంపిక చేసింది. వాటిలో అంత వేగంగా రైళ్ల ప్రయాణం సాధ్యమా కాదా అని తేల్చేందుకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలకు బాధ్యత అప్పగించింది. ఇందులో భాగంగా ఢిల్లీ–చండీగఢ్‌ సెక్షన్‌ను ఫ్రెంచ్‌ కంపెనీకి, చెన్నై–కాజీపేట మార్గాన్ని జర్మన్‌ కంపెనీకి, చెన్నై–బెంగళూరు–మైసూరు మార్గాన్ని చైనా కంపెనీకి, ఢిల్లీ–జైపూర్‌ మార్గాన్ని ఇటలీ కంపెనీకి అప్పగించాలని నిర్ణయించింది. 2016లో గోవాలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోదీ జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ మార్గాన్ని రష్యా రైల్వే కంపెనీకి అప్పగించాలని నిర్ణయించారు.

ఆ మేరకు అదే సంవత్సరం రష్యన్‌ రైల్వేస్‌కు సంబంధించి భారత్‌లో ఉన్న విభాగం అధిపతి వ్లాదిమీర్‌ ఎ ఫినోవ్‌... భారత రైల్వే బోర్డు యంత్రాంగంతో చర్చలు జరిపారు. అందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగా అలెగ్జాండర్‌ కులాగిన్‌ ఆధ్వర్యంలోని 12 మంది ఇంజనీరింగ్‌ నిపుణులతో కూడిన రష్యన్‌ రైల్వేస్‌ ప్రతినిధి బృందం హైదరాబాద్‌ వచ్చింది. స్థానిక రైల్వే అధికారులతో కలసి ప్రత్యేక రైలులో సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి నాగ్‌పూర్‌ వరకు పరిశీలిస్తూ ప్రయాణించింది. గంటకు 200 కి.మీ. వేగంతో రైలు దూసుకెళ్లాలంటే ప్రస్తుత ట్రాక్‌లో చేయాల్సిన మార్పులను గుర్తించింది. ఆ తర్వాత మరో బృందం 2017 డిసెంబర్‌లో నాగ్‌పూర్‌కు వెళ్లి అక్కడి నుంచి సికింద్రాబాద్‌ వరకు ప్రయాణిస్తూ అధ్యయనం చేసింది. కానీ ఇప్పటివరకు నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ కారిడార్‌ ప్రతిపాదన అటకెక్కినట్టేనన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ తాజాగా ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ జరిపిన చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు రావడంతో అది సాకారమయ్యే అవకాశం ఉందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. ఇది సాకారమైతే రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం సగానికి సగం తగ్గిపోతుంది. దాదాపు నాలుగు గంటల్లోనే గమ్యం చేరే అవకాశం ఉంటుంది. ఫలితంగా హైదరాబాద్‌–ఢిల్లీ ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. ఆ మేరకు వీలుగా ట్రాక్‌ను పూర్తిస్థాయిలో పటిష్టం చేస్తారు. నివేదిక సమర్పించిన తర్వాత అంచనా వ్యయం విలువ తెలుస్తుంది.  

వేగంగా మూడో లైన్‌ పనులు.... 
కాజీపేట–బల్లార్షా మార్గం అత్యంత కీలకమైనది కావడంతో ఈ కారిడార్‌లో ప్రయాణించే రైళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో రైళ్ల వేగం మందగించింది. ఈ మార్గం బొగ్గు వ్యాగన్లు ప్రయాణించేది కావడం, బొగ్గు సరఫరాకు ప్రాధాన్యం ఉండటంతో ఈ మార్గంలో వాటి కోసం ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను కూడా నిలిపేస్తున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్ల ప్రయాణంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ కారిడార్‌లో మూడో మార్గం నిర్మించాలని రైల్వేశాఖ గతంలో నిర్ణయించి ప్రయారిటీ ప్రాజెక్టుగా గుర్తించింది. ఫలితంగా పనులు వేగంగా సాగుతున్నాయి. కాజీపేట నుంచి మంచిర్యాల మధ్య దాదాపు పని పూర్తయింది. మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, మందమర్రి సెక్షన్‌లో పనులు చివరి దశకు వచ్చాయి. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌–మాకుడి మధ్య 29 కి.మీ. మార్గంలో ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ కోసం పెండింగ్‌లో పడ్డాయి. రాఘవాపురం–పొత్కపల్లి మధ్య 31 కి.మీ. మార్గం, బిజ్గర్‌ షరీఫ్‌–ఉప్పల్‌ మధ్య 18 కి.మీ. మార్గంలో ఇటీవలి వరకు భూసేకరణ జరగక నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తి కావొచ్చాయి. ప్రస్తుతం బీరూరు–మాణిక్‌ఘర్‌ పనులు జరుగుతున్నాయి. హైస్పీడ్‌ కారిడార్‌ కావాలంటే ఆ మార్గంలో గూడ్సు రైళ్లు తిరగొద్దని రష్యన్‌ ఇంజనీర్లు గతంలో పేర్కొన్నారు. ఇప్పుడు మూడో కారిడార్‌ అందుబాటులోకి వస్తే ఆ సమస్య కూడా దాదాపు పరిష్కారమవుతుంది. భవిష్యత్తులో నాలుగో లైన్‌ కూడా నిర్మించనున్నారు.  

రైల్‌–19 వస్తుందా...?
వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌... భారతీయ రైల్వేలో నవశకానికి నాంది పలికింది. ఇంజిన్‌ లేని ఈ రైలు అభివృద్ధి చెందిన దేశాల వేగవంతమైన రైళ్లను తలపిస్తోంది. గంటకు 180 కి.మీ. వేగంతో దూసుకుపోతోంది. రైల్‌–18 పేరిట మొదలైన ఈ రైళ్ల తదుపరి వెర్షన్‌ రైల్‌–19 (2019)గా రాబోతోంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పూర్తిగా సీటింగ్‌కే పరిమితం కాగా కొత్త వెర్షన్‌లో స్లీపర్‌ కోచ్‌లు ఉంటాయి. ఈ సంవత్సరమే పట్టాలెక్కే ఈ రైళ్లు సెమీ హైస్పీడ్‌ రైళ్లుగా నిలుస్తున్నాయి. మరి సికింద్రాబాద్‌–నాగ్‌పూర్‌ సెమీ హైస్పీడ్‌ కారిడార్‌లో వీటినే ప్రవేశపెడతారా లేక అధునాతన కొత్త రైళ్లను ప్రారంభిస్తారా అన్న విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు