Najma Parveen: మోదీపై పీహెచ్‌డీ

11 Nov, 2023 01:21 IST|Sakshi

న్యూస్‌మేకర్‌

నరేంద్ర మోదీ గుజరాత్‌ సి.ఎం. అయ్యాక, ప్రధాని పదవి చేపట్టాక ఆయనపై పీహెచ్‌డీలు చేసిన వారు చాలామంది ఉన్నారు. కాని వారిలో ముస్లిం స్కాలర్లు... అందునా మహిళా ముస్లిం స్కాలర్లు దాదాపుగా లేరు. ఆ విధంగా చూస్తే మోదీపై పీహెచ్‌డీ చేసిన మొదటి మహిళా స్కాలర్‌గా వారణాసికి చెందిన నజ్మా పర్వీన్‌ గుర్తింపు పొందింది.

చేనేత కుటుంబంలో పుట్టి
నజ్మా పర్వీన్‌ది వారణాసి దాపున ఉన్న లల్లాపుర. తల్లిదండ్రులు చేనేత కార్మికులు. కాని వారు ఆమె చిన్నప్పుడే మరణించారు. అయినా తన చదువుకు ఆటంకం కలిగించకుండా కొనసాగించింది పర్వీన్‌. బెనారస్‌ హిందూ యూనివర్సిటీ (బి.హెచ్‌.యు.)లో పొలిటికల్‌ సైన్స్‌ చదివి 2014లో పీహెచ్‌డీ సీటు తెచ్చుకుంది. ఆ సమయంలో ఆమె ఎంచుకున్న అంశం ‘నరేంద్రమోడీస్‌ పొలిటికల్‌ లీడర్‌షిప్‌: యాన్‌ అనలిటికల్‌ స్టడీ’.

నజ్మా పర్వీన్‌ తన పీహెచ్‌డీకి ఈ అంశం తీసుకున్నాక ‘నాక్కూడా భవిష్యత్తులో రాజకీయ నేత కావాలని ఉంది. అందుకే నేను భారతీయ ఆవామ్‌ ΄ార్టీనీ స్థాపించాను కూడా. ఆ ΄ార్టీని ఎలా రూపుదిద్దాలి అనుకున్నప్పుడు నాకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద దృష్టి మళ్లింది. ఆయన రాజకీయాలలో ధ్రువతార వంటి వారు. 2014 నుంచి దేశంలో ఆయన సమర్థ నాయకత్వం కొనసాగింది. ట్రిపుల్‌ తలాక్‌ మీద ఆయన తెచ్చిన చట్టాన్ని సమర్థిస్తూ నేను మొదటగా శుభాకాంక్షలు తెలియచేశాను’ అని తెలిపింది నజ్మా.

పేదరికంలో ఉన్న నజ్మా పర్వీన్‌ చదువుకు ‘విశాల్‌ భారత్‌ సంస్థాన్‌’ స్థాపించిన ప్రొఫెసర్‌ రాజీవ్‌ శ్రీవాస్తవ సహకరిస్తే బి.హెచ్‌.యు. ప్రొఫెసర్‌ సంజయ్‌ శ్రీవాస్తవ గైడ్‌గా వ్యవహరించారు. 8 ఏళ్ల సమయం తీసుకుని 20 హిందీ, 79 ఇంగ్లిష్‌ గ్రంథాలు అధ్యయనం చేసి నజ్మా ఈ పీహెచ్‌డీని పూర్తి చేసింది.

మరిన్ని వార్తలు