నేడు తెలంగాణకు మోదీ

11 Nov, 2023 04:12 IST|Sakshi

మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొననున్న ప్రధాని

ఈ నెల 26న నిర్మల్‌లో కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న మోదీ

రాష్ట్రంలో ఎన్నికల ప్రచార ముగింపు సభకూ రాక

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ తరపున ప్రచారంకోసం మరోసారి రాష్ట్రానికి రానున్నారు.  హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీల ఆత్మగౌరవ సభలో పాల్గొన్న ప్రధాని మళ్లీ శనివారం మాదిగల విశ్వరూప మహాసభకు హాజరుకానున్నారు. తొలుత బీసీ సీఎం నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న ప్రధాని, ఈసారి తెలంగాణతో పాటు ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాధాన్యం సంతరించుకున్న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే  కమంలో జరుగుతున్న బహిరంగసభకు హాజరవు తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్టీల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లను 9 లేదా 10 శాతానికి పెంచే విషయంపైనా మోదీ ఏదైనా ప్రకటన చేయవచ్చునని ఊహాగానాలు సాగుతు న్నాయి.

ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి ప్రతిష్టా త్మకంగా మారిన నేపథ్యంలో రాష్ట్ర జనాభాలో బీసీలు, ఎస్సీ, ఎస్టీలు కలిపి 80 శాతానికి పైగానే ఉండటంతో వీరి మద్దతును కూడగట్టే దిశలో పార్టీ జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా.. శనివారం సాయంత్రం 5 గంటలకు ఎమ్మార్పీఎస్‌ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘మాదిగ, ఉపకులాల విశ్వరూప మహాసభ’లో ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు.

మధ్యాహ్నం 2.35 నిముషాలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి సాయంత్రం 4.45కు ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టులో దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పరేడ్‌గ్రౌండ్స్‌కు చేరుకుని సాయంత్రం 5 నుంచి 5.40 వరకు బహిరంగ సభలో పాల్గొంటారని పార్టీనేతల సమాచారం. సాయంత్రం 6 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు. అదేవిధంగా ఈ నెల 26న నిర్మల్‌లో నిర్వహించే ఎన్నికల ప్రచారంలో కూడా మోదీ పాల్గొననున్నట్టు పార్టీనేతల సమాచారం. దీంతో పాటు రాష్ట్రపార్టీ ఎన్నికల ప్రచార పర్వం ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించే సభకు సైతం మోదీ హాజరవుతారని పార్టీవర్గాలు వెల్లడించాయి. 

ఇదీ చదవండి: అమలు గ్యారంటీ

మరిన్ని వార్తలు