అమృతాప్రణయ్‌కు నిరాశ.. దక్కని చివరి చూపు!

9 Mar, 2020 11:41 IST|Sakshi

మిర్యాలగూడ: తండ్రిని కడసారి చూసేందుకు పోలీసు భద్రత నడుమ స్మశానవాటిక వద్దకు వెళ్లిన అమృతాప్రణయ్‌కు నిరాశే మిగిలింది. మారుతీరావు బంధువులు, స్థానికులు ‘అమృత గో బ్యాక్‌’ అంటూ పెద్ద  ఎత్తున నినాదాలు చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రణయ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పోలీసు వాహనంలో వచ్చిన అమృత.. వాహనం దిగి తండ్రి భౌతికకాయం వద్దకు వెళ్తున్న క్రమంలో.. ఆమెకు వ్యతిరేకంగా స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువులు నినాదాలు చేశారు. తండ్రి చావుకు కారణమైన ‘అమృత గో బ్యాక్‌’, ‘మారుతీరావ్‌ అమర్‌ రహే’ అంటూ అడ్డుకున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసుల సాయంతో ఆమె తిరిగి వాహనం ఎక్కి కూర్చున్నారు. పోలీసుల సూచనమేరకు తండ్రిని చివరి చూపు చూడకుండానే వెనుదిరిగారు.
(చదవండి: మారుతిరావు ఆత్మహత్య)

కాగా, ప్రణయ్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు తిరునగరు మారుతీరావు నిన్న (శనివారం) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో ఆదివారం ఉదయం ఆయన విగతజీవిగా కనిపించారు. తన కూతురును కులాంతర వివాహం చేసుకున్నాడన్న కోపంతో.. ప్రణయ్‌ అనే దలిత యువకుడిని మారుతీరావు హత్య చేయించాడని ఆరోపణలు ఎదుర్కొన్న విషయం విదితమే.
(చదవండి: చిచ్చుపెట్టిన ప్రేమ వివాహం)


ఇదిలాఉండగా.. మారుతీరావు మృతికి సంబంధించిన పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక బహిర్గతమైంది. మారుతీరావు ఒంటిపై ఎటువంటి గాయాలు లేవని... విషం కలిపిన గారెలు తిన్న కారణంగానే ఆయన మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. విషం కారణంగా రక్త ప్రసరణ ఆగిపోయి శరీరంలోని అవయవాలన్నీ పనిచేయకుండా ఆగిపోయాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో బ్రెయిన్‌ డెడ్‌ అయి.. ఆ తర్వాత గుండెపోటు వచ్చినట్లు తెలిపారు. మారుతీరావు తిన్న గారెల్లో విషం కలిసినందువల్లే శరీరం రంగు మారిందని పేర్కొన్నారు. విస్రా శాంపిళ్ల విశ్లేషణలో ఆయన ఎటువంటి విషయం తీసుకున్నాడో తేలుతుందని తెలిపారు.
(చదవండి: మారుతీరావు పోస్ట్‌మార్టం ప్రాథమిక నివేదిక)

మరిన్ని వార్తలు