నర్సింగ్‌ హోంలపై దాడులను అరికట్టాలి

15 Jun, 2019 12:23 IST|Sakshi
పట్టణంలో రాస్తారోకో చేస్తున్న వైద్యులు   

నర్సంపేటరూరల్‌: ప్రైవేట్‌ నర్సింగ్‌హోంలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. నర్సంపేట పట్టణంలోని వైద్యుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి, వరంగల్‌ రోడ్డు కూడలి వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ప్రోటెక్షన్‌ డే సందర్భగా వైద్యులంతా నర్సింగ్‌ హోంలు బంద్‌ చేసి రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. ఇటీవల వరంగల్, కోల్‌కత్తాలో వైద్యులపై అన్యాయంగా దాడులు చేసి అక్రమ కేసులు బనాయించారన్నారు.

వైద్యుడిని దేవుడితో సమానంగా బావించాల్సిన ప్రజలు తమపైనే దాడులు చేయడం ఆందోళన కలిగిస్తుందన్నారు. 12 సంవత్సరాలు కష్టపడి వైద్య కోర్సు చదివి వచ్చి ప్రజలకు వైద్యం చేస్తుంటే తమపై దాడులకు పాల్పడడం సరికాదని, ఇలా అయితే వైద్య వృత్తిని వైద్యులు వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. అనంతరం ఆర్డీఓ, నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిసుదర్శన్‌రెడ్డికి వేర్వేరుగా వినతిపత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో వై ద్యులు జయుడు, రాజేశ్వర్‌రావు, ఎడ్ల రమేష్, రామకృష్ణారెడ్డి, విరీన్, కిరణ్, కిషన్, సంపత్, మనోజ్‌లాల్, భారతి, నవత, సుజాతరాణి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు