టిక్‌టాక్‌తో ఒత్తిడి చిత్తు!

7 Mar, 2020 10:19 IST|Sakshi

పరీక్షల సమయంలో ఒత్తిడిని దూరం చేసే వీడియోలు

టిక్‌టాక్‌ సాయంతో ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’ ప్రయత్నం

సాక్షి, హైదరాబాద్‌: పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థుల్లో టెన్షన్‌.. టెన్షన్‌.. సరిగ్గా చదవకపోవడం, తల్లిదండ్రుల ఒత్తిడి, క్లాస్‌మేట్స్‌తో పోటీ.. ఇలా ఒత్తిడికి కారణాలు బోలెడు! అనుకున్న మార్కులు రాకపోతే అఘాయిత్యాలకు పాల్పడేది కూడా ఒత్తిడి వల్లే.. జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో గణాంకాల ప్రకారం 2014–2016 మధ్యకాలంలో దేశం మొత్తం మీద 26 వేల మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడితే.. వీరిలో పరీక్షల్లో ఫెయిలైన కారణంగా తనువు చాలించిన వారు 7,462 మంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే.. పరీక్షల చుట్టూ ఉన్న ఒత్తిడిపై ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అవగాహన పెంచేందుకు ‘సేవ్‌ ది చిల్డ్రన్‌’స్వచ్ఛంద సంస్థ ఓ వినూత్నమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. వీడియో అప్లికేషన్‌ ‘టిక్‌టాక్‌’ఈ ప్రయత్నానికి తనవంతు సాయం అందిస్తోంది.

వీడియోల రూపంలో చిట్కాలు..
పరీక్షల సమయంలో ఒత్తిడిని అధిగమించేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటి గురించి తెలిస్తే విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. సేవ్‌ ది చిల్డ్రన్, టిక్‌టాక్‌లు ఇదే పనిచేస్తున్నాయి.
"# BeatTheStress’ కార్యక్రమం కింద సేవ్‌ ది చిల్డ్రన్‌ కార్యకర్తలు ఒత్తిడిని జయించే చిట్కాలను వీడియోల రూపంలో అందిస్తారు. పరీక్షకు ఎలా సిద్ధమవ్వాలి? ఏ రకమైన ఆహారం తీసుకోవాలి? వంటి అనేక అంశాలపై టిక్‌టాక్‌ ద్వారా వీడియో సందేశాలు అందిస్తారు. ఉదాహరణకు సమాధానాలు బాగా వచ్చిన ప్రశ్నలకు ముందు సమాధానాలు రాయడం. తద్వారా ప్రశ్నపత్రాలు దిద్దే వారిలో ఆ విద్యార్థిపై సానుకూల దృక్పథం ఏర్పడుతుందని, తద్వారా మంచి మార్కులు సాధించొచ్చని ఓ నిపుణుడు చెప్పడం ఒక వీడియోలో ఉంటే.. మరో వీడియోలో పరీక్షలు ముఖ్యమే గానీ.. జీవితం అంతకంటే ఎక్కువ విలువైందన్న సందేశం కూడా ఉంటుంది. చిన్నచిన్న పాటలు, గేయాలు, సరదా సన్నివేశాలు, యానిమేషన్లు, జీఐఎఫ్‌లన్నింటినీ వాడుతూ విద్యార్థులు ఒత్తిడికి దూరంగా ఉంచేందుకు బీట్‌ ది స్ట్రెస్‌ కార్యక్రమం ద్వారా ప్రయత్నిస్తున్నట్లు టిక్‌టాక్‌ ఫర్‌ గుడ్‌ ఇండియా అధ్యక్షురాలు డాక్టర్‌ సుబి చతుర్వేది తెలిపారు. చదువును ఒక వేడుకగా చేసేందుకు, తద్వారా విద్యార్థుల విపరీత ఆలోచనలను నివారించేందుకే తాము ఈ ప్రయత్నం చేస్తున్నామని సేవ్‌ ది చిల్డ్రన్‌కు చెందిన జ్యోతి నాలే తెలిపారు.

మరిన్ని వార్తలు