ఆర్టీసీ కార్మికులకు యాచకురాలి సాయం

18 Nov, 2019 10:42 IST|Sakshi
ఆర్టీసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ శ్రీనివాస్‌కు రూ. 4వేలు అందజేస్తున్న సైదమ్మ

రూ.4 వేలు అందజేత

సాక్షి, మిర్యాలగూడ: ఆమె ఓ యాచకురాలు.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో 30 ఏళ్లుగా భిక్షాటన చేస్తోంది. ఆర్టీసీ కార్మికులంతా ఆ యాచకురాలికి సుపరిచితులు. కాగా 43 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండటంతో పాటు చాలా మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కార్మికులకు సాయం చేయాలనే ఉద్దేశంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం లావూడి తండాకు చెందిన సైదమ్మ తాను భిక్షాటన చేసి పోగేసిన రూ.4 వేల 43లను వారికి అందించింది. ఆదివారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌లో సమ్మెలో భాగంగా కార్మికులు దీక్ష చేపట్టిన టెంటు వద్దకు వెళ్లి ఆర్టీసీ నల్లగొండ జేఏసీ కన్వీనర్‌ శ్రీనివాస్‌కు రూ.4 వేలు అందజేసింది. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.. తాను 30 ఏళ్లుగా బస్టాండ్‌లో ఉంటూ యాచిస్తున్నానని.. ఆర్టీసీ కార్మికులంతా పరిచయస్తులు అని, వారి కడుపులు మాడుతుంటే తనకు ఎంతో బాధ కలిగిందని వివరించింది. వారికి సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ పని చేశానని తెలిపింది. దీంతో అక్కడున్న వారు ఆమెను అభినందించారు.  

మరిన్ని వార్తలు