భూపాలపల్లే ‘కీ’లకం

13 Mar, 2019 11:41 IST|Sakshi

సాక్షి, భూపాలపల్లి: వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో గెలుపోటములు నిర్ణయించడంలో ఈ సారి భూపాలపల్లి ఓటర్లు ‘కీ’లకంగా మారనున్నారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో భూపాలపల్లిలోనే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. దీంతో ఈ సారి ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం కీలకంగా కానుంది.

వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మొత్తంగా 16,53,474 మంది ఓటర్లు ఉండగా భూపాలపల్లి నియోజకవర్గంలో 2,63,130 మంది ఉన్నారు. 2014 ఎన్నికల సందర్భంగా పార్లమెంట్‌ పరిధిలో భూపాలపల్లి నియోజకవర్గం నుంచే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.

2,37,803 ఓట్లకు గానూ 1,87,711 ఓట్లు  (80 శాతం) పోలయ్యాయి. కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో మాత్రం ఓటింగ్‌ 70 శాతానికి పడిపోయింది.

‘సింగరేణి’ ఓట్లే 30వేలు 

వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలో ఒక్క భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోనే సింగరేణి గనులు విస్తరించి ఉన్నాయి. దాదాపుగా ఏడు వేల మంది కార్మికులు ఇక్కడ పని చేస్తున్నారు. మొత్తం మీద 30 వేల కు పైగా సింగరేణి కార్మికుల కుటుంబాల ఓట్లు ఉన్నా యి. వీరు ఎటు మొగ్గుచూపితే అటు నియోజకవర్గంలో మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది. 

మరిన్ని వార్తలు