సోదరుల చేతిలో తమ్ముడు హతం

13 Feb, 2018 14:21 IST|Sakshi

తల్లిపోషణ భారమై అన్నదమ్ముల మధ్య గొడవ

కర్రతో దాడిచేసి తమ్ముడిని హతమార్చిన అన్నలు

తాను పస్తులుండి.. తన కొడుకుల కడుపునింపిందా తల్లి.. అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసింది. చివరికి ఆ తల్లే వారికి భారమైంది. ఆమెను పోషించాడానికి అన్నదమ్ములు గొడవపడ్డారు. కర్రతో దాడి చేసి ఆ ఇద్దరు సోదరులు తమ్ముడిని హతమార్చారు.  


కాసిపేట(బెల్లంపల్లి) : కాసిపేట మండలం ధర్మరావుపేట లంబాడితండాలో తల్లిపోషణ విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ జరిగింది. మద్యంమత్తులో ఇద్దరు అన్నలు కలిసి తమ్ముడు అరికెల్ల సాయికుమార్‌(25)పై కర్రతో దాడిచేయగా అక్కడికక్కడే మృతి చెందాడు. దేవాపూర్‌ ఎస్సై శ్రీకాంత్‌ కథనం ప్రకారం.. ధర్మరావుపేట లంబాడితండా గ్రామానికి చెందిన భీమయ్య, పోశమ్మ దంపతులకు నలుగురు కుమారులు. భీమయ్య మృతిచెందగా నలుగురు కుమారులు భూమయ్య, కొమురయ్య, గంగరాజు, సాయికుమార్‌ భార్యపిల్లలతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మూడో కుమారుడు గంగరాజు ధర్మరావుపేటలోని తన సొంతఇంట్లో ఆదివారం శుభకార్యం నిర్వహించారు. సాయికుమార్‌ వెంకటపూర్‌లో నివాసం ఉంటుండగా అన్న ఇంట్లో శుభకార్యానికి వచ్చాడు. కార్యక్రమం ముగించుకుని ఇంటికి వెళ్లిన సాయికుమార్‌ను అన్నలు ఫోన్‌చేసి పిలిచి మద్యం తేవాలని ఒత్తిడి చేశారు. రాత్రి 9గంటల అనంతరం సాయికుమార్‌ మద్యం తీసుకువచ్చాడు. అన్నదమ్ములుంతా కలిసి ఆదివారం అర్ధరాత్రి వరకు మద్యం సేవించినట్లు∙తెలిపారు. మద్యంమత్తులో తల్లి పోశమ్మ, ఇంటివిషయాల గురించి గొడవ పడగా మూడో అన్న గంగరాజు సాయికుమార్‌ను కర్రతో కొట్టే ప్రయత్నంలో మరో అన్న భూమయ్య సాయిని గట్టిగా పట్టుకున్నాడు. కర్రతో కొట్టడంతో తీవ్రంగా రక్తస్రావమై సాయికుమార్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు గంగరాజు, భూమయ్యపై కేసునమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రిలో సీఐ రాంచందర్‌రావు మృతదేహాన్ని పరిశీలించారు.

మరిన్ని వార్తలు