సీబీఐకి చిక్కిన పీఎఫ్ ఉద్యోగి

18 Nov, 2014 03:28 IST|Sakshi

నిజామాబాద్ క్రైం : ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ ఉద్యోగి లంచం తీసుకుంటూ సోమవారం సీబీఐ అధికారులు చిక్కాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం మర్కల్‌కు చెందిన గండ్రెడ్డి గంగాధర్ అడ్లూర్ ఎల్లారెడ్డిలోని గాయ త్రి ఘగర్ ఫ్యాక్టరీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా 12 ఏళ్లు పనిచేశాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేశాడు. పీఎఫ్ కోసం నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. అప్పటి నుంచి పలుమార్లు పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరిగాడు. గంగాధర్‌కు సంబంధించిన పత్రాలపై గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం సంతకాలు సరిపోకపోవడంతో కార్యాల యం వారు పత్రాలను తిప్పి పంపారు.

ఈ నెల 11న గంగాధర్‌కు సంబంధించిన పత్రాలను పీఎఫ్ కార్యాలయంలో అనుమతించి, అతని అకౌంట్ క్లియర్ చేశారు. రూ. లక్షా 67 వేల పీఎఫ్ డబ్బులు వచ్చాయని, కార్యాలయానికి వచ్చి డబ్బులు తీసుకెళ్లాలని కార్యాలయ ఉద్యో గి సమాచారం అందించాడు. అతడు జిల్లా కేంద్రంలోని పీఎఫ్ కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్ గంగాధర్‌ను కలిశాడు. రూ. 7 వేలు లంచం ఇస్తేనే పీఎఫ్ డబ్బులు ఇస్తానని సదరు ఉద్యోగి చెప్పడంతో అంత ఇచ్చుకోలేనని పీఎఫ్ లబ్ధిదారుడు గంగాధర్ పేర్కొన్నాడు.

ఇరువురి మధ్య రూ. 6 వేలకు ఒప్పందం కుదిరింది. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని గంగాధర్.. శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్లి సీబీఐని ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు సోమవారం పీఎఫ్ కార్యాలయానికి వచ్చి సీనియర్ అసిస్టెంట్‌కు డబ్బులు ఇచ్చాడు. సీబీఐ అధికారులు పీఎఫ్ ఉద్యోగిని పట్టుకుని, కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు