బాలికలకు వరం

22 Feb, 2018 09:24 IST|Sakshi

కేజీబీవీల్లో ఇంటర్‌ విద్య

కేంద్రం అంగీకారం..

‘పది’ తర్వాత కూడా చదువు కొనసాగించే వీలు..

ప్రయోజనం చేకూరుతుందంటున్న విద్యార్థినులు

ఆదిలాబాద్‌టౌన్‌: ఆర్థిక స్థోమత లేక చదువు మధ్యలో మానేసిన, తల్లిదండ్రులు లేని నిరుపేద బాలికలకు విద్యను అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ విద్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ పాఠశాలల్లో ప్రస్తుతం ఆరు నుంచి 10వ తరగతి వరకు విద్యను అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 6నుంచి 8వ తరగతి విద్యార్థులకు చదువుకు అవసరం అయి న నిధులు విడుదల చేస్తుండగా.. 9,10వ తరగ తి విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యయాన్ని భరిస్తోంది. డెప్యూటీ సీఎం ఆధ్వర్యంలో బాలిక విద్య సబ్‌ కమిటీ మంగళవారం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్‌ను కలిసి కేజీబీవీల్లో ఇంటర్‌ వరకు విద్యను పొడి గించాలని కోరగా ఇందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో కేజీబీవీల్లో చదువుతున్న విద్యార్థులకు మేలు జరగనుంది. వచ్చే విద్య సంవత్సరం నుంచి ఇంటర్‌ ప్రవేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. 

ఉమ్మడి జిల్లాలో..
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 68 కేజీబీవీలున్నాయి. వీటిలో 10,380 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. జిల్లాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్‌లోని 17 కేజీబీవీల్లో 2,385 మంది, నిర్మల్‌లో 18 కేజీబీవీల్లో 2900 మంది, ఆసిఫాబాద్‌ కుమ్రంభీం జిల్లాలో 15 కేజీబీవీల్లో 2500 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 18 కేజీబీవీల్లో 2600 విద్యార్థులు చదువుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున ఈ విద్యాలయాలను ఏర్పాటు చేశా రు. ఈ పాఠశాలల్లో చదివిన వారికి వసతితో పాటు నాణ్యమైన భోజనం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. భోజన మెనూలో కూడా ఇటీవల ప్రభుత్వం మార్పు చేసింది. వారానికి రెండు సా ర్లు మటన్, నాలుగు సార్లు చికెన్, రోజు కోడిగుడ్డు, నెయ్యి, ఆకుకూరలు, కూరగాయలు, పెరుగు, పాలు, స్నాక్స్‌ అందిస్తున్నారు. అంతే కాకుండా న్యాప్‌కిన్స్, కాస్మోటిక్‌ కిట్లను అంది స్తున్నారు. నాణ్యమైన విద్య అందించడంతో పేద కుటుంబాలకు చెందిన బాలికలు చదువుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పది తర్వాత చదువు కొనసాగించే వీలు..
కేజీబీవీల్లో చదివి పదో తరగతి ఉత్తీర్ణులైన చాలా మంది ఇంటర్‌ విద్యను కొనసాగించలేకపోతున్నారు. గురుకులాల్లో ఇతర కళాశాలల్లో అందరికీ సీట్లు లభించకపోవడం, వారి సొంత గ్రామాలకు వెళ్లిపోవడం, ఆర్థిక స్థోమత కారణంగా అక్కడికే చదువును ఆపేస్తున్నారు. ఈ క్రమంలో కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం తో విద్యార్థులకు మేలు జరగనుంది. ఉన్నత చదువు చదువుకునే వీలుంటుంది. పదో తరగతి వరకు కేజీబీవీలో చదివిన వారు ఆ తర్వాత అక్కడే విద్యను కొనసాగించేందుకు అవకాశం కల్పించడంతో తల్లిదండ్రుల్లో కూడా తమ పిల్లలపై భద్రత భావం ఉంటుంది.

ఎట్టకేలకు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేజీబీవీల ను ఇంటర్‌ విద్య వరకు పొడిగిస్తామని పలు సా ర్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాలిక విద్య ఉపసంఘానికి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చైర్మన్‌గా ఉండడంతో అమలుకు నోచుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఉత్తీర్ణులైన వారు ఆ కేజీబీవీల్లోనే  ఇంటర్‌ చదువుకునే అవకాశం ఉం టుంది. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం పదో తరగతి విద్యార్థులు 2500 మంది ఉన్నారు.

ప్రభుత్వ నిర్ణయంతో మేలు..
ఆరు నుంచి పదో తరగతి వరకు ఆదిలా బాద్‌ కేజీబీవీలో చదువుతున్నా. ప్రభుత్వ నిర్ణయంతో ఇంటర్‌ కూడా ఇక్కడే చదువుకునే అవకాశం కల్పించింది. నాణ్యమైన విద్యతో పాటు అన్ని వసతులు బాగున్నాయి.   – శీతల్, పదోతరగతి విద్యార్థి, ఆదిలాబాద్‌

విద్యార్థులకు ప్రయోజనం
ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు మేలు జరగనుంది. కేజీబీవీల్లో ప్రస్తుతం పదోతరగతి వరకే విద్యను అందించడం జరుగుతుంది. పది పూర్తయిన తర్వాత కొంత మంది పిల్లలు ఇంటర్‌ అభ్యసించకుండా చదువు  మానేస్తున్నారు. కేజీబీవీల్లో ఇంటర్‌ ఏర్పాటు చేయడం వల్ల పదో తరగతి ఉత్తీర్ణులైన వారు అనంతరం ఇక్కడే చదువుకోవచ్చు. – లస్మన్న, ఆర్వీఎం సెక్టోరియల్‌ అధికారి

మరిన్ని వార్తలు