టీఆర్‌ఎస్‌ స్పీకర్‌  అభ్యర్థికి కాంగ్రెస్‌ మద్దతు 

18 Jan, 2019 00:54 IST|Sakshi

ఉత్తమ్‌కు ఫోన్‌ చేసిన కేసీఆర్‌ 

అసెంబ్లీలో మద్దతు కోరిన కేటీఆర్‌ 

పోటీ పెట్టొద్దని కాంగ్రెస్‌ సభ్యుల నిర్ణయం  

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభ స్పీకర్‌గా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ప్రకటించింది. స్పీకర్‌ అభ్యర్థిగా పోచారం దాఖలు చేసిన నామినేషన్ల సెట్‌పై కాంగ్రెస్‌ తరఫున ఆ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే భట్టి విక్రమార్క సంతకం చేశారు. స్పీకర్‌ ఎన్నికను ఏకగ్రీవం చేయాలని కోరుతూ బుధవారం రాత్రి టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో సీఎం కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడగా, గురువారం మధ్యా హ్నం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అసెంబ్లీ లాబీలోని కాం గ్రెస్‌ పార్టీ చాంబర్‌కు వెళ్లి మద్దతు కోరారు. స్పీకర్‌గా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని ప్రతిపాదిస్తున్నామని, దీనికి మద్దతు తెలపాలని కోరారు.

దీంతో ఉత్తమ్‌ సూచన మేరకు కాంగ్రెస్‌ తరఫున స్పీకర్‌ అభ్యర్థి నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి భట్టి హాజరై నామినేషన్ల సెట్‌పై సంతకం చేశారు. అంతకు ముందు జరిగిన సీఎల్పీభేటీలోనూ కాంగ్రెస్‌ సభ్యులు స్పీకర్‌ ఎన్నికపై చర్చించారు. ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి స్పీకర్‌ ఎన్నిక అంశాన్ని ప్రస్తావించగా, తనకు సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి మద్దతు అడిగినట్టు ఉత్తమ్‌ వెల్లడించారు. ఈ నేపథ్యంలో స్పీకర్‌ ఎన్నిక కోసం కాంగ్రెస్‌ అభ్యర్థిని బరిలో దించవద్దని, టీఆర్‌ఎస్‌ ప్రతిపాదించే అభ్యర్థికి మద్దతివ్వాలని సీఎల్పీ సమావేశం నిర్ణయించింది.  

మరిన్ని వార్తలు