డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం 

7 Apr, 2018 11:20 IST|Sakshi
అలివేలు (ఫైల్‌)


జడ్చర్ల : వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేదని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మండలంలోని కోడ్గల్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సత్యమ్మ, శేఖర్‌ దంపతుల కూతురు అలివేలు(19) జడ్చర్లలోని బీఆర్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతుంది. అయితే శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురిని చూసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనై శోకసంద్రంలో మునిగిపోయారు. అయితే డిగ్రీ వార్షిక పరీక్ష ఫీజు చెల్లించలేకే మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే అలివేలు ఆత్మహత్యకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని సీఐ బాలరాజుయాదవ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు