డీపీఓ బదిలీ

22 Nov, 2014 03:33 IST|Sakshi

ఇందూరు : జిల్లా పంచాయతీ అధికారి సురేశ్‌బాబు బదిలీ అయ్యారు. ఆయనను నల్గొండ జిల్లాకు బదిలీ చేస్తూ పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్ పీటర్  శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాకు నల్గొం డ డీపీఓ కృష్ణమూర్తి బదిలీపై వస్తున్నారు. కృష్ణమూర్తి హైదరాబాద్‌కు చెందినవారు. కలెక్టర్ రొనాల్డ్ రోస్ సెలవు నుంచి రాగానే సురేశ్‌బాబు రి లీవ్ అవుతారు.

 ఆ తర్వాత కృష్ణమూర్తి జిల్లాకు వచ్చి విధుల్లో చేరుతారు. సురేశ్‌బాబు జిల్లాకు డీపీఓగా 2010 మే 11న వచ్చారు. నాలుగున్నర సంవత్సరాల పాటు పని చేసిన ఆయనకు ముక్కుసూటితనం, నిక్కచ్చి గా వ్యవహరించడం, పైరవీలకు తావిచ్చేవారు కాదని పేరుంది. అసెంబ్లీ, పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో తనదైన శైలిలో పనిచేసి ప్రత్యేక ముద్ర వేసుకున్నారు.

 ఎక్కడా కూడా రీ పోలింగ్ జరగకుండా, పొరపాట్లు లేకుండా పనిచేసిన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. లోతుగా పరిశీలించి పని చేయడం, క్షుణ్ణంగా చూసిన తరువాతే ఫైళ్లపై సంతకాలు చేయడం ఆయన ప్రత్యేకతలు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుటుంబ సర్వే, దాని తరువాత పెన్షన్, ఆహార భద్రతా కార్డుల సర్వేలో కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్‌లో సర్వే వేగవంతం చేయడానికి తోడ్పడ్డారు.

 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించిన వర్క్‌షాపుల్లో పాల్గొన్నారు. పథకాల అమలు, పంచాయతీ రాజ్ నూతన చట్టం తయారీలో ప్రభుత్వానికి సలహాలిచ్చారు. ప్రభుత్వం నుంచి రాష్ట్ర అధికారుల నుంచి ఎన్నో ప్రసంశలు పొందారు. జిల్లాలో అత్యధిక కాలం పని చేసిన జిల్లాస్థాయి అధికారి సురేశ్‌బాబే కావడం గమనార్హం. పలుమార్లు జరిగిన బదిలీల్లో ఈయన పేరు ఉన్నప్పటికీ కలెక్టర్‌లు నిలిపివేయించారు. 

మరిన్ని వార్తలు