-
నర్సంపేట: ఎన్నికల సంఘం ఫ్లయింగ్ స్క్వాడ్ గురువారం తెల్లవారుజామున 4 గంటలకు వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణం లోని కాంగ్రెస్ కార్యాలయం తాళం పగులగొట్టి తనిఖీలు చేయడం వివాదాస్పమైంది. నర్సంపేట మునిసిపాలిటీలో ఏఈగా పనిచేస్తున్న సతీశ్ ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున ఆయన మరో నలుగురు అధికారులతో కలసి కాంగ్రెస్ కార్యాలయానికి చెందిన తలుపు తెరిచి ఓ వీడియోగ్రాఫర్ ద్వారా చిత్రీకరించారు. కార్యాలయంలో కాంగ్రెస్ జెండాలు, టీషర్ట్లు ఉండడంతో వాటి వివరాలు నమోదు చేసుకొని బయల్దేరారు. కాంగ్రెస్ ముఖ్యులతోపాటు 500 మంది కార్యకర్తలు రావడాన్ని చూసి నలుగురు అధికారులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. సతీశ్ ఒక్కరే ఉండడంతో అతడిని చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు, సమాచారం లేకుండా కార్యాలయం తాళాన్ని ఎలా పగలగొడుతారని నిలదీశారు.
తనిఖీలు మాత్రమే చేశాం..
ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారి సతీశ్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధం గా వస్తువులు ఉన్నాయనే సమాచారంతో తలు పులు తెరిచి ఉన్న కార్యాలయంలో తనిఖీలు చేశామని తెలిపారు. సీఐ దేవేందరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులతో చర్చలు జరిపి మరోసారి కార్యాలయాన్ని తనిఖీ చేయగా కాంగ్రెస్కు చెందిన జెండాలు, టీషర్ట్లు మాత్రమే ఉన్నాయని నిర్ధారణకు వచ్చారు. ఆర్డీఓ రవి మాట్లాడుతూ కార్యాలయంలో పార్టీకి సంబంధించిన మెటీరియల్ మాత్రమే ఉన్నందున ఎలాంటి కేసు నమోదు చేయలేదని, అలాగే ఎన్నికల అధికారి సతీశ్ పార్టీ కార్యాలయానికి చెందిన తాళం పగులగొట్టినట్లు ఎలాంటి ఆధా రం లేనందున కేసు నమోదు చేయలేదన్నారు.