ఇంజనీరింగ్‌లో భారీగా సీట్ల కోత

30 Jun, 2015 01:47 IST|Sakshi
ఇంజనీరింగ్‌లో భారీగా సీట్ల కోత

87 వేల సీట్లకు గుర్తింపు నిరాకరించిన జేఎన్‌టీయూహెచ్
ఇందులో 40 వేల సీట్లను స్వచ్ఛందంగా వదులుకున్న యాజమాన్యాలు
ఈ ఏడాది సీట్లు 76,635కే పరిమితం.. కాలేజీల సంఖ్య మాత్రం 220
పేరున్న కాలేజీల్లోనూ భారీగా కోత.. నకిలీ ఫ్యాకల్టీపైనా దృష్టి
అత్యధిక కాలేజీల్లో ఒకటీ రెండు కోర్సులకే అనుబంధ గుర్తింపు
ప్రమాణాల మేరకే కాలేజీల్లో సీట్లు: శైలజా రామయ్యర్
జూలై 6 నుంచి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ!

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి భారీ సంఖ్యలో సీట్లకు కోత పడింది. గత ఏడాది 1.63 లక్షల సీట్లకు గుర్తింపురాగా.. ఈసారి కేవలం 76,635 సీట్లకే అనుబంధ గుర్తింపు లభించింది. తగ్గిపోయిన సీట్లలో 40 వేల సీట్లను కాలేజీల యాజమాన్యాలే స్వచ్ఛందంగా వదులుకోగా.. దాదాపు మరో 47 వేల సీట్లకు జేఎన్‌టీయూహెచ్ అనుమతి నిరాకరించింది. మొత్తంగా గత ఏడాది కంటే ఈసారి ఏకంగా 87 వేల సీట్లు తగ్గిపోయాయి.

నిర్దిష్ట ప్రమాణాలు, ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్న కాలేజీల్లో పలు కోర్సులు, బ్రాంచీలకు మాత్రమే అనుబంధ గుర్తింపును మంజూరు చేసింది. దీంతో చాలా కాలేజీలు ఒకటీ రెండు కోర్సులకే పరిమితమయ్యాయి. అయితే సీట్లలో భారీగా కోతపెట్టినా... గతేడాది (125 కాలేజీలు) కంటే ఎక్కువగా ఈసారి 220 కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుమతి ఇవ్వడం గమనార్హం. కాగా వచ్చే నెల 6న ఈ సీట్లకు వెబ్ ఆప్షన్లను చేపట్టనున్నారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై విద్యా మండలి ప్రకటన చేసే అవకాశముంది.
 
నాణ్యతకు ప్రాధాన్యం..
జేఎన్టీయూహెచ్ పరిధిలో 2015-16 విద్యా సంవత్సరానికి గుర్తింపు కోసం 245 ఇంజనీరింగ్ కాలేజీల నుంచి దరఖాస్తులురాగా 220 కాలేజీలకు గుర్తింపు ఇచ్చినట్లు ఇన్‌చార్జి వీసీ శైలజా రామయ్యర్ తెలిపారు. సోమవారం జేఎన్టీయూహెచ్‌లో రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణారావు, అకడమిక్ ఆడిట్‌సెల్ డెరైక్టర్ విజయకుమారితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని మొత్తం 290 ఇంజనీరింగ్ కాలేజీల్లో 245 దరఖాస్తు చేసుకున్నాయని చెప్పారు.

ఆ దరఖాస్తులను పరిశీలించి, తనిఖీలను నిర్వహించి 220 కళాశాలల్లోని 76,635 సీట్లకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్లు ఆమె తెలిపారు. నిబంధనల ప్రకారం లేని 25 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదన్నారు. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్‌లో విద్యార్థులు కళాశాలల వారీగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న పూర్తిస్థాయి సమాచారాన్ని పరిశీలించిన మీదట కోర్సులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు.

రాష్ట్రంలో సాంకేతిక విద్యను పటిష్ట పరిచేందుకు చర్యలు చేపడుతున్నామని.. ఇందుకోసం జేఎన్టీయూహెచ్ సంస్కరణలకు నాంది పలికిందని పేర్కొన్నారు. కాలేజీల్లో పూర్తిస్థాయి ఫ్యాకల్టీ, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యమిచ్చామని, నిపుణులైన ప్రొఫెసర్లు కాలేజీలను తనిఖీ చేశారని శైలజా రామయ్యర్ వెల్లడించారు. అలాగే విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

ఉపాధి అవకాశాలు పెంచేందుకు క్వాలిటీ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల వారీగా కోర్సులు, అందుబాటులో ఉన్న సీట్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. ఇంజనీరింగ్ కాలేజీల్లో మొదట బోగస్ ఫ్యాకల్టీని తాము గుర్తించామని రిజిస్ట్రార్ రమణారావు తెలిపారు. ఆ తరువాత కేంద్రం దృష్టి పెట్టిందని, దాంతో దేశవ్యాప్తంగా 60 వేల బోగస్ ఫ్యాకల్టీ ఉన్నట్లు తేలిందని చెప్పారు. కాలేజీలు బోగస్ ఫ్యాకల్టీని చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
ఆమోదం పొందిన బ్రాంచ్‌లు, సీట్లు
సివిల్ ఇంజనీరింగ్                    9,825
సీఎస్‌ఈ                               22,440
ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ             2,160
ఈసీఈ                                 20,070
ఈఈఈ                                 9,945
మెకానికల్ ఇంజనీరింగ్              9,285
ఇతర బ్రాంచీలు                       2,910
మొత్తం సీట్లు                        76,635

మరిన్ని వార్తలు