పురాణపండ శ్రీనివాస్‌కు ఘన సత్కారం

12 Feb, 2020 17:50 IST|Sakshi

హైదరాబాద్‌: మానసిక వ్యవస్థ విరాజిల్లడానికి అద్భుతమైన గ్రంథాల్ని రచించడంలో, ప్రచురించడంలో సత్యాన్వేషణతో కూడిన కొత్త సొగసుల్ని సృష్టించి వేలాదిమందికి ఆకట్టుకుంటున్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ ని హైదరాబాద్ త్యాగరాయగానసభలో అపురూప విలువల మధ్య ఘనంగా సత్కరించారు. ఈ సందర్భం శ్రీనివాస్ మాట్లాడిన ప్రతీ పలుకూ సభికుల్ని తన్మయత్వానికి గురిచేశాయి. తెలంగాణా రాష్ట్రప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కే.వి.రమణాచారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా వారం రోజులపాటు జరిగిన తెలంగాణా సాంస్కృతిక సప్తాహ వేడుకల ముగింపు ఉత్సవాన్ని శ్రీనివాస్ లాంఛనంగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పురాణపండ శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ ఉత్సవానికి మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీమంత్రి సి.హెచ్.విద్యాసాగరరావు గౌరవ అతిధిగా హాజరయ్యారు. 

సభకు అధ్యక్షత వహించిన త్యాగరాయగాన సభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి మాట్లాడుతూ.. రమణాచారి వంటి ప్రతిభాశాలి జన్మదిన సందర్భంగా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి పురాణపండ శ్రీనివాస్ వంటి తెలుగు రాష్ట్రాలలో విశేష ఖ్యాతిగాంచిన రచయిత రావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగరరావు మాట్లాడుతూ ఐదుగురు ముఖ్యమంత్రుల వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసి , సమర్ధ సేవలతో జాతీయ స్థాయిలో పేరుపొందిన రమణాచారి వంటి సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి అత్యుత్తమ వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు. భక్తి పారవశ్యపు మహా స్వరూప అత్యద్భుత గ్రంధంగా పురాణపండ శ్రీనివాస్ ఏడవసారి ప్రచురించిన ‘ శ్రీపూర్ణిమ ‘ మహాగ్రంధాన్ని విద్యాసాగర్ రావు ఆవిష్కరించి, పురాణపండ శ్రీనివాస్ ప్రయత్నం, లక్ష్యం , దశ, దిశ, గమనం, గమ్యం అన్నీ అద్భుతంగా వుంటాయని శ్రీనివాస్ భాషలోని సొగసులు ఎంతో ఆకర్షణీయంగా వుంటాయన్నారు. తెలుగు వాకిళ్ళలో ఇలాంటి నిస్వార్ధ ప్రతిభామూర్తిని ఎక్కడో గానీ చూడమన్నారు. ఈ వేడుకలో సంస్కృత పండితులు , ఆచార్యలు చలమచర్ల వేంకట శేషాచార్యుల్ని రమణాచారి తండ్రి రాఘవాచార్యుల స్మారక పురస్కారంతోను , ప్రముఖ లలిత సంగీత గాయకులు, లిటిల్ మ్యూజిక్ అకాడమీ చైర్మన్ రామాచారిని రమణాచారి స్ఫూర్తి పురస్కారంతోను సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఐ.ఏ.ఎస్.అధికారి కె.వి. రమణాచారి మాట్లాడుతూ- తన జన్మదిన వేడుకను ఇంత అందంగా , అద్భుతంగా నిర్వహించిన కళా జనార్ధనమూర్తిని అభినందించారు. సభా సమావేశాలకూ దూరంగా వుండే పురాణపండ శ్రీనివాస్ వంటి మానవవిలువల ప్రతిభాసంపన్నమైన ప్రజ్ఞ కలిగిన ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తన వేడుకకు ముఖ్య అతిధిగా రావడంపట్ల తాను చాలా సంతోషిస్తున్నానని పేర్కొంటూ విద్యాసాగర్రావు వంటి రాజకీయ వ్యక్తిత్వం మూర్తీభవించిన శిఖరం హాజరవవ్వడం పట్ల ప్రశంసలు వర్షించారు. ఈ వేడుకలో అందరినీ విస్మయపరిచే ప్రసంగం చేసి ఆకర్షించిన అరుదైన అతిధి పురాణపండ శ్రీనివాస్ ని సభపక్షాన విద్యాసాగర్ రావు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు. ఇంత చక్కని సభను ఏర్పాటుచేసిన కళా జనార్ధనమూర్తిని జంట నగరాల సాంస్కృతిక సంస్థలు, తెలంగాణా ప్రభుత్వ అధికారులు అభినందించారు.

మరిన్ని వార్తలు