యాదాద్రి క్షేత్రంలో గవర్నర్ నరసింహన్
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంలో తనకు జరిగిన ఆశీర్వచనం రాష్ట్రానికి జరిగినట్లేనని గవర్నర్ నరసింహన్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు, వేద పండితులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. సుమారు గంట పాటు ఆలయంలో గడిపారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఆలయంలో తనకు మంచి అనుభూతి కలిగిందన్నారు. వేద పండితులు, ఆలయ అర్చకులు చతుర్వేద పఠనంతో తనను సంతోషింపజేశారని పేర్కొన్నారు. రాష్టŠట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని తాను కోరుకున్నానని తెలిపారు. గవర్నర్ వెళ్లే వరకు భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సునీత మహేందర్రెడ్డి, కలెక్టర్ అనితారామచంద్రన్, ఈఓ గీతారెడ్డి పాల్గొన్నారు.