గుడుంబా పునరావాసం లబ్ధిదారుడితో ఎక్సైజ్ అధికారుల ఆరా
‘గుడుంబా సొమ్ము గుటుక్కు’ కథనానికి స్పందన
నవాబుపేట: గుడుంబా పునరావాసం కల్పనలో ఏమైనా అక్రమాలు జరిగాయా.. అంటూ ఎక్సైజ్ అధికారులు లబ్ధిదారుడితో ఆరా తీశారు. గుడుంబా తయారీ, అమ్మకం మానేసిన వారికి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తున్న విషయం విదితమే. అయితే.. ఎక్సైజ్ అధికారులు ఆ సొమ్మును పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
ఈ విషయమై ‘సాక్షి’ మెయిన్లో శనివారం ‘గుడుంబా సొమ్ము గుటుక్కు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఇందులో మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటకు చెందిన ప్రభాకర్ వాదన వచ్చింది. స్పందించిన ఎక్సైజ్ అధికారులు శనివారం ఉదయమే రంగంలోకి దిగారు. ప్రభాకర్కు అందిన ఆవులను ఎక్సైజ్ శాఖ మహబూబ్నగర్ రూరల్ ఎస్ఐ రామకృష్ణ పరిశీలించారు.
ఆవుల కొనుగోలు సమయంలో మధ్యవర్తి ఏమైనా బెదిరించాడా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లబ్ధిదారులను ఎంపిక చేసి ఎంపీడీవోలకు అప్పగించడంతో తమ విధి పూర్తవుతుందని తెలిపారు. పథకం అమలును ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారని చెప్పారు.