గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్‌

12 Nov, 2019 13:11 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీలో ఎస్‌ఓ ఇష్టారాజ్యం

సాక్షి, అక్కన్నపేట: గిరిజన విద్యార్థుల మాతృ భాషపై కేజీబీవీ ప్రత్యేకాధికారి ఆంక్షలు విధిస్తున్నాడు. ఆ భాషలో మాట్లాడితే జరిమానా చెల్లించాలంటూ ఎస్‌ఓ హుకుం జారీ చేస్తున్నాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట కేజీబీవీ ఆశ్రమ పాఠశాలలో ఇది జరుగుతోంది. అకౌంటెంట్‌ ఉన్నప్పటికీ అన్నీ వ్యవహారాలు ఎస్‌ఓ చేతి మీదుగా సాగుతున్నాయని, నిధుల దుర్వినియోగంతో పాటు ఆమె ఆడిందే ఆట.. పాడిందే పాట.. అన్న చందంగా పరిస్థితి తయారైందని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఎస్‌ఓ విషయం తెలుసుకున్న గిరిజన సంఘాల నాయకులు భగ్గుమంటున్నారు.

సోమవారం అక్కన్నపేట మండల ఎంపీపీ మాలోతు లక్ష్మి కేజీబీవీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి ఆరా తీశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా? అని తెలుసుకున్నారు. కాగా, తరగతి గదిలో ‘గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్‌’వేస్తున్నారని ఓ గిరిజన విద్యార్థిని తెలిపింది. ఎంపీపీ మాట్లాడుతూ తమ సమస్యలను చెప్పుకోవడానికి విద్యార్థులు భయపడుతున్నారని, గిరిజన భాషలో మాట్లాడితే ఫైన్‌ విధించడాన్ని తప్పుపట్టారు.  

మరిన్ని వార్తలు