మే 25 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

29 Apr, 2019 01:51 IST|Sakshi

పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేసిన ఇంటర్మీడియెట్‌ బోర్డు

జూన్‌ 1తో పూర్తికానున్న థియరీ పరీక్షలు.. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. వచ్చే నెల 25 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వరుసగా ఎనిమిది రోజులు పరీక్షలు జరుగుతాయి. జూన్‌ 1తోఅడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ముగుస్తాయి. జూన్‌ 7 నుంచి 10 వరకు ప్రాక్టికల్స్, జూన్‌ 3, 4 తేదీల్లో ఎథిక్స్, హ్యూమన్‌ వాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షలు జరుగుతాయి. వొకేషనల్‌ కోర్సులకు సంబంధించి కూడా పరీక్ష తేదీలు వాటి ప్రకారమే ఉండనున్నాయి. వాస్తవానికి మే రెండో వారం నుంచే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ ఇంటర్‌ ఫలితాల్లో నెలకొన్న తప్పిదాలు, దాని ఫలితంగా దారితీసిన పరిస్థితులతో తేదీల మార్పు అనివార్యమైంది. పరీక్ష ఫీజు స్వీకరణ మొదలు రీ వాల్యుయేషన్, రీ కౌంటింగ్‌ పక్రియలో జాప్యం జరగడంతో ఈ మేరకు పరీక్ష తేదీలు ముందుకు వెళ్లాయి.

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ...

ఫలితాల విడుదల ఆలస్యం...
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ మూడో వారంలో వెలువడే అవకాశం ఉంది. మరోవైపు ఇంటర్‌ ఫలితాలపై బోర్డులో నెలకొన్న గందరగోళం ఇంకా కొనసాగుతోంది. సాంకేతిక సమస్యల పరిష్కారంతోపాటు రిజల్ట్స్‌ ప్రాసెస్‌ ఎవరు చేస్తారనే దానిపై ఇంకా సందిగ్ధం వీడలేదు. దీంతో ఫలితాల విడుదల మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదల ఆలస్యమయ్యేకొద్దీ ఆ ప్రభావం విద్యార్థులపై పడనుంది. సాధారణంగా జూన్‌ మొదటి వారం నుంచే అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. పలు రకాల సెట్లకు సంబంధించిన ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులు సర్టిఫికెట్లతో కౌన్సెలింగ్‌కు హాజరవుతారు. ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో జాప్యం జరిగితే ఆయా అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు దూరమయ్యే అవకాశం లేకపోలేదు. 

మరిన్ని వార్తలు