బ్లాక్‌లో ఐపీఎల్‌ టికెట్లు 

8 Apr, 2019 19:48 IST|Sakshi

ఈవెంట్స్‌ నౌ బుకింగ్‌

క్లర్కులే సూత్రధారులు 

ముగ్గురి అరెస్టు 

సాక్షి, సిటీబ్యూరో: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ టికె ట్లను బ్లాక్‌లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను మధ్య మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు ఈవెంట్స్‌ నౌ సంస్థ బుకింగ్‌ క్లర్కులు కాగా, మరొకరు కౌంటర్‌ వద్ద ఏజెంట్‌ కావడం గమనార్హం. డీసీపీ పి.రాధాకిషన్‌రావు  కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తుకారాంగేట్‌కు చెందిన రంజిత్‌ కుమార్‌ రే, యాప్రాల్‌ వాసి ఆర్‌.వరుణ్‌కుమార్‌ అసెంబ్లీ మెట్రో స్టేషన్‌లోని ఈవెంట్స్‌ నౌ సంస్థ కౌంటర్‌లో బుకింగ్‌ క్లర్కులుగా పని చేస్తున్నారు.

మల్కాజ్‌గిరికి చెందిన ఎ.రాహుల్‌ చారి ఇదే స్టేషన్‌లోని కౌంటర్‌ వద్ద ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరు ముగ్గురూ కలిసి ఐపీఎల్‌ మ్యాచ్‌ టిక్కెట్లను బ్లాక్‌ మార్కెట్‌కు మళ్లిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ఒక్కో టిక్కెట్టును రెట్టింపు ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. దీనిపై సమాచారం అందుకున్న సెంట్రల్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సాయిని శ్రీనివాసరావు నేతృత్వంలోని బృందం దాడి చేసి నిందితులను అదుపులోకి తీసుకుంది. వీరి నుంచి రూ.37,500 నగదు, 16 ఐపీఎల్‌ టిక్కెట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసును సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు.   

మరిన్ని వార్తలు