ఉద్యోగులకు అన్యాయం చేసిన కేసీఆర్‌

13 Nov, 2018 11:09 IST|Sakshi
నగరంలో పలు డివిజన్లలో ప్రచారం చేస్తున్న బండి సంజయ్‌ 

బీజేపీ కరీంనగర్‌ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌

కరీంనగర్‌సిటీ: సకల జనుల ఉద్యమంలో కీలకపాత్ర పోషించి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటాలకు క్షేత్రస్థాయిలో నేతృత్వం వహించిన ఉద్యోగులపై కేసీఆర్‌ కక్షసాధింపు చర్యలతో తీవ్ర అన్యాయం చేశాడని బీజేపీ కరీంనగర్‌ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం నగరంలోని 21, 25వ డివిజన్లలో ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ  ప్రచారం  హౌసింగ్‌బోర్డు కాలనీ, మధుర నగర్, గాయత్రి నగర్, మేదరివాడ, శషామహల్‌ ప్రాంతంలో సాగింది. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ ఎన్నో ఆశలతో నూతన ఆవిర్భావ రాష్ట్రంలో తమకు తమ కుటుంబాలకు వ్యక్తిగత, సామాజిక భద్రతతోపాటు సరైన రీతిలో గౌరవ అభిమానాలు లభిస్తాయనుకున్న ఉద్యోగులకు అవమానకరమైన మనోవేదనను కేసీఆర్‌ మిగిల్చాడని విమర్శించారు. 

నూతన రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు, మండలాల విభజనతో ఉద్యోగులపై మానసిక భౌతిక ఒత్తిడి తీవ్రమైందన్నారు. బదిలీల క్రమంలో ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులకు గురయ్యారన్నారు. బీజేపీ నాయకులు తోట సాగర్, కోడూరి అనిల్, కటుకం రమేశ్, గడ్డం మహేశ్వర్‌రెడ్డి, కొట్టె రవి, ఇస్కమల్ల సంజీవ్, దర్శనాల క్రిష్ణ, పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి, చిట్టిమల్ల సంతోష్, రచ్చ సాయికిరణ్,తోట సతీష్‌లతో పాటు బీజేపీ ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు  బోయినిపల్లి ప్రవీణ్‌రావు ,బండ రమణారెడ్డి, నాంపెల్లి శ్రీనివాస్, ఉప్పరపెల్లి శ్రీనివాస్, సర్దార్‌ సంజీత్‌సింగ్‌ పాల్గొన్నారు. 

ఎన్టీఆర్‌ ఆశయాలను గౌరవించేది బీజేపీయే...
కరీంనగర్‌రూరల్‌: తెలుగువారి ఆత్మగౌరవాన్ని అవమానించిన ఢిల్లీ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఆవిర్భవించిన టీడీపీ నేడు ఎన్‌టీఆర్‌ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్‌తో చేతులు కలపడం ఎన్టీఆర్‌ అభిమానులను మోసం చేయడమేనని బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు.  కరీంనగర్‌ రూరల్‌ మండలం ఇరుకుల్ల గ్రామంలో సోమవారం ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం, పాదయాత్ర నిర్వహించారు. 

మహాకూటమి ఆవిర్భావంలో సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చిన విషయం ప్రజలు గమనించి ఎన్టీఆర్‌ ఆశయాలను గౌరవించే బీజేపీకి ఎన్టీఆర్‌ అభిమానులు, టీడీపీ పార్టీ కార్యకర్తలు సానుభూతిపరులు బీజేపీకి ఓట్లువేసి గెలుపించాలని కోరారు. నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, దాసరి రమణారెడ్డి, కూకట్ల రమేశ్, కోత్తూరి సంపత్, బలుసులఅనిల్, హరిక్రిష్ణ, వెంకటేష్, శ్రీనివాస్, ప్రశాంత్, ప్రవీణ్, రాజేష్, బాలి సత్యం, రమేశ్, వంశీ, సదానందం, తిరుపతి, దేవేందర్‌లతోపాటు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు