విరేచనాలతో పీహెచ్సీలోకి చేరిన రోగులు
తూర్పుగోదావరి, తొండంగి (తుని): గ్రామంలోని పలువురు విరేచనాలతో బాధపడుతూ తొండంగి పీహెచ్సీలో చేరారు. దీంతో గ్రామంలో డయేరియా జాడలున్నట్టు స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. బీసీ కాలనీ, ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలు విరేచనాలతో గ్రామంలోని పీహెచ్సీలో వైద్యం పొందుతున్నారు. ఒక్కసారిగా ఎక్కువమంది వీటితో బాధపడుతుండడంతో తహసీల్దార్ ఎస్.అప్పారావు, ఎంపీడీవో జీఎస్ఎన్ మూర్తి కలిసి ఆస్పత్రిలో రోగులను పరామర్శించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై వైద్యురాలు పావనీని ఆరా తీశారు.
రోగులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. సుమారు 20 మంది వరకూ ఆస్పత్రిలో చేరడంతో çగ్రామంలోని పంచాయతీ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి ట్యాంకులను, వాటర్ను పరిశీలించాలని పంచాయతీ అధికారులు ఆదేశించారు. తాగునీటిని క్లోరినేషన్, ఎప్పటికప్పుడు జరుగుతున్న పరిస్థితులపై నివేదించాలన్నారు. గ్రామంలో తాగునీరు, ఆహారపదార్థాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రచారం చేయాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ్య లోపంతోపాటు రక్షిత మంచినీటి సరఫరా సక్రమంగా జరగడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.దీనిపై సమగ్రమైన విచారణ జరిపి, పారిశుద్ధ్యం మెరుగుపరచడంతోపాటు రక్షిత తాగునీటిని సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.