మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం మనదే

21 Jan, 2020 03:13 IST|Sakshi

పోలింగ్‌ ముగిసేంతవరకు పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలి 

ఎన్నికల పనిలో నిమగ్నం కావాలి

టీఆర్‌ఎస్‌ శ్రేణులకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ దిశానిర్దేశం 

దావోస్‌ నుంచి ‘ఎన్నికల బృందం’తో ఫోన్‌లో సమీక్ష 

సాక్షి, హైదరాబాద్‌ : ఈనెల 22న జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్షాలకు అందనంత దూరంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు విజయవంతంగా పాల్గొన్నాయని పేర్కొన్నారు. పోలింగ్‌ ముగిసేంతవరకు టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి మరింత ఉత్సాహంతో పార్టీ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా పనిచేయాలని సూచించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌ వెళ్లిన ఆయన అక్కడి నుంచి ఫోన్‌ లో పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ బృందం, సీనియర్‌ నేతలతో సోమవారం సమీక్ష జరి పారు. ప్రచారంలో భాగంగా ప్రతిపక్షాలు దూషణలకు పాల్పడితే టీఆర్‌ఎస్‌ శ్రేణులు మాత్రం తాము చేసిన అభివృద్ధి, భవిష్యత్‌ ప్రణాళికలను ప్రజలకు స్పష్టంగా వివరించారని కేటీఆర్‌ చెప్పారు. ప్రజల్లో కనిపిస్తున్న సానుకూల స్పం దన చూస్తుంటే అన్ని ఎన్నికల మాదిరిగానే మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా ప్రజల ఆశీర్వాదం తప్పకుండా లభిస్తుందని, టీఆర్‌ఎస్‌ ఘన విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

ప్రచారానికి సమయం ముగియడంతో ఎన్నికల ఏర్పాట్లపై నేతలు దృష్టి సారించాలని, వెంటనే స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జులతో మాట్లాడి పోలింగ్‌ బూత్‌లవారీగా ఏజెంట్ల నియామకంపై దృష్టి పెట్టాలని, పోలింగ్‌ ఏజెం ట్ల జాబితాను సిద్ధం చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శులు, మున్సిపల్‌ ఎన్నికల ఇంచార్జులకు ఆదేశాలు జారీ చేశారు. బూత్‌ ఏజెంట్ల జాబితాను స్థానిక ఇన్‌చార్జులకు ఇవ్వాలని సూచించారు. అలాగే ఎన్నికల ఫలితాల తర్వాత చైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరారు. ప్రతిపక్షాలు గెలుస్తామనుకునే ఒకటి, రెండు వార్డుల్లో అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడేందుకు ఆయా పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉందని, ఇలాంటి చోట్ల టీఆర్‌ఎస్‌ కేడర్‌ అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షాల ప్రయత్నాలను గమనించాలన్నా. 

ఎప్పటికప్పుడు సమాచారం: పల్లా 
తెలంగాణ భవన్‌ నుంచి కేంద్ర ఎన్నికల సమన్వయ కమిటీ బృందం ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటోందని, క్షేత్రస్థాయి నుం చి వస్తున్న సమాచారం మేరకు టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉందని కేటీఆర్‌కు పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. ఎమ్మె ల్యేలు, మంత్రులతో మాట్లాడుతూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. 

మరిన్ని వార్తలు