గుండెపోటుతో చనిపోయాడంటున్న పోలీసులు
హైదరాబాద్ : దొంగతనం కేసులో విచారణకు తీసుకొచ్చిన నిందితుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. ఈ ఘటన బుధవారం సనత్నగర్ పోలీస్ స్టేషన్లో జరిగింది. గుండెపోటుతో మరణించాడని పోలీసులు చెబుతుండగా మరోవైపు వారు కొట్టిన దెబ్బలతోనే చనిపోయి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవున్నాయి. రామంతాపూర్కు చెందిన కూలీ ప్రేమ్చంద్ (37)ను ఎర్రగడ్డ బజాజ్ ఆటో ఫైనాన్స్ ఏజెంట్లు వాహనాలు, ఈఎంఐల రికవరీ కోసం తీసుకుని వెళుతుంటారు.
ఇదేక్రమంలో వారంక్రితం ఓ ఏజెంట్ రికవరీ అయిన రూ.2లక్షలను బజాజ్ ఆఫీసులో చెల్లించాల్సిందిగా ప్రేమ్చంద్కు ఇచ్చాడు. ప్రేమ్చంద్ ఆ డబ్బును ఇవ్వకుండా పరారయ్యాడు. సంస్థ ప్రతినిధుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా డబ్బు భువనగిరిలో దాచిపెట్టినట్లు చెప్పాడు. దీంతో మంగళవారం పోలీసులు అతడిని భువనగిరి తీసుకుని వెళ్లగా అక్కడ డబ్బు దొరకలేదు. అక్కడి నుంచి తీసుకొచ్చే క్రమంలోనే నిందితుడు గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల దెబ్బలతోనే మరణించాడా?
నగదు రికవరీ కోసం పోలీసులు ప్రేమ్చంద్పై థర్డ్ డిగ్రీని ప్రయోగించడం వల్లే మరణించి ఉండొచ్చని, అందువల్లే గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని అప్పగించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.