మంచిర్యాల: పీఎస్‌లో కుప్పకూలిన నిందితుడు, లాకప్‌డెత్‌ కలకలం

28 Aug, 2023 08:40 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో లాకప్‌ డెత్‌ ఘటన కలకలం సృష్టించింది. తాళ్లగుర్జాల పోలీస్ స్టేషన్‌లో అంజి అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఆగస్టు 26న జరిగిన ఈ ఘటన జరగ్గా.. స్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో మృతుడి చనిపోయే ముందు క్షణాలు రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో స్టేషన్‌ హాల్‌లో కూర్చున్న వ్యక్తి కొద్దిసేపు ఫోన్‌ చూస్తూ కనిపించాడు. ఏమైందో ఏమోగానీ కాసేపటికి ఉన్నట్టుండి కూర్చున్న చోటే కుప్పకూలి ప్రాణాలు వదిలాడు.

అయితే పోలీసుల తీరుపై బాధితుడి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌ డిగ్రీ ఉపయోగించడం వల్లే అంజీ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకొని.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. 

అయితే నిందితుడిది లాకప్‌ డెత్‌ కాదని పోలీసులు చెబుతున్నారు. అతనికి ఫిట్స్‌ రావడంతో చనిపోయాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం వ్యక్తి మరణానికి గల అసలు కారణం తెలిసే అవకాశం ఉంది. పోలీసులు కొట్టడం వల్లే మరణించాడా? లేక నిజంగానే అతనిది సహజ మరణమా తెలియాల్సి ఉంది. కాగా ఓ మహిళ ఇంటిపై దాడి చేసిన చేసులో అంజీని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు