సరిహద్దులో తనిఖీలు చేయండి

19 Dec, 2014 23:37 IST|Sakshi

బంట్వారం: కర్ణాటక సరిహద్దులోని తొర్మామిడి శివారులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసులకు సూచించారు. శుక్రవారం ఆమె బంట్వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డులను, ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే పీఎస్‌ను సందర్శించినట్లు తెలిపారు. బంట్వారం ఠాణా పరిధిలో 2012లో 86 కేసులు నమోదవగా 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతేడాది  109 కేసులకు గాను 11 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు 92 కేసులు నమోదవగా 32 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. 22 కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యాయని తెలిపారు.

తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న తొర్మామిడి శివారులో మఫ్టీలో నిత్యం వాహనాల తనిఖీలు చేయాలని ఎస్పీ ఈసందర్భంగా మోమిన్‌పేట సీఐ రంగాను ఆదేశించారు. వాహనాల తనిఖీలతో చోరీలను నివారించవచ్చని చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంట్వారం పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలు, ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలు తగ్గిపోయాయని ఆమె వివరించారు. రాంపూర్, తొర్మామిడి, మోత్కుపల్లి, బార్వాద్ తదితర గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి సంబంధించి 4 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు. ఓ గ్యాంగ్ ట్రాన్స్‌ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్నట్లు తాము గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు.

సదరు గ్యాంగ్ ఆట కట్టించేందుకు ఓ పోలీస్ బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో మంచి నీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. బోరు వేయడానికి కావల్సిన బడ్జెట్ కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. స్థానిక సిబ్బంది పనితీరుపై బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎస్పీ రాజకుమారి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీ స్వామి, సీఐ రంగా, స్థానిక ఎస్‌ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు