ఐటీ రైడ్స్‌.. పొంగులేటి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం?

10 Nov, 2023 14:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ఆదాయపన్నుల విభాగం(ఐటీ) సోదాలు ముగిశాయి. సోదాల అనంతరం అధికారులు తమ వెంట కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్లినట్లు సమాచారం.  

శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని పొంగులేటి నివాసంలో రెండు బృందాలుగా అధికారులు తనిఖీలు నిర్వహించారు. నివాసంలోని ఓ రూంలో అధికారులు చాలాసేపు ఉన్నారు. ఆఖర్లో ఆ గది నుంచి మూడు బ్యాగులు, బ్రీఫ్‌ కేసు, ప్రింటర్‌, కీలక డాక్యుమెంట్లు తమ వెంట తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు  బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 10లో ఉన్న రాఘవా ప్రైడ్‌ ఆఫీస్‌లోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. 

ఇదిలా ఉంటే.. గురువారం ఉదయం నుంచి ఖమ్మంలోని పొంగులేటి నివాసం, ఆయనకు చెందిన కంపెనీలు, బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, లాంకోహిల్స్‌, రాయదుర్గం, బషీర్‌బాగ్‌ ప్రాంతాలతోపాటు ఖమ్మం టౌన్‌, ఖమ్మం రూరల్‌, పాలేరు, స్వగ్రామం కల్లూరులోని నారాయణపురంలో ఈ సోదాలు జరిగాయి.

కాంగ్రెస్‌ ఈ ఐటీ రైడ్స్‌ను ప్రతీకార రాజకీయ చర్యగా అభివర్ణించింది. తాను నామినేషన్‌ వేసిన సమయంలోనే ఐటీ దాడులు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, అధికారులు తమల్ని ఇబ్బందిపెట్టారంటూ సోదాలు ముగిసిన అనంతరం పొంగులేటి సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.   బెంగళూరు, చెన్నైకి చెందిన 200 మందికిపైగా అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్టు సమాచారం.

మరిన్ని వార్తలు