భగీరథ.. దాహం తీర్చే

5 Apr, 2019 11:33 IST|Sakshi
కల్వకుర్తి పట్టణంలోని భగీరథ ఆఫీస్‌లో వాటర్‌ ఫౌంటేన్‌

అన్ని గ్రామాలకు నిత్యం తాగునీటి సరఫరా

 ట్యాంకర్ల సరఫరాకు స్వస్తి

సాక్షి, కల్వకుర్తి: వేసవి వస్తే చాలు పల్లెలు, పట్టణాలని వ్యత్యాసం లేకుండా తాగునీటికి కష్టాలు ఉండేవి. మహిళలు బిందెలు పట్టుకొని వ్యవసాయ పొలాలలోని బోర్ల వద్దకు పరుగులు తీసేవారు. ప్రభుత్వం లీజ్‌బోర్లు, ట్యాంకర్లతో సరఫరా చేస్తూ రూ.కోట్లు వ్యయం చేసేది. ఎన్ని సమీక్షలు పెట్టినా నిధులు నీళ్ల వ్యయం చేసినా నీటి కష్టాలు మాత్రం తీరేవి కావు. ప్రజలు నీటి బిందెలు పట్టుకొని ధర్నాలు సైతం చేసేవారు. ప్రతి గ్రామ సర్పంచ్‌కి అధికారులకు ఈ సమస్య  పెద్దతలనొప్పిగా మారేది. ప్రస్తుతం అంతా మారిపోయింది. సీఎం కేసీఆర్‌ బృహత్తరమైన ఆలోచన తాగునీటి ఎద్దడికి శాశ్వతమైన పరిష్కారం చూపింది. మిషన్‌ భగీరథతో అ న్ని చోట్ల తాగునీటి కటకటకు పుల్‌స్టాప్‌ పడింది. వేసవిలో సైతం దాహం తీరి నీటి కష్టాలు తొలిగాయి.

35 గ్రామాలకు సరఫరా
మండలంలోని 35 గ్రామాలకు భగీరథ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. అన్ని చోట్ల అవసరాన్ని గుర్తించి కొత్తగా ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకులు మం జూరు చేశారు. కొన్ని చోట్ల ట్యాంకుల నిర్మాణం పూర్తయింది. మిగతా చోట్ల నిర్మాణంలో ఉన్నా యి. నిర్మాణం పూర్తయిన గ్రామాలు సుద్దకల్, గుండూరు, తాండ్ర, పంజుగుల్, సత్యసాయికాలనీలో కొత్త ట్యాంకులకు నీరు ఎక్కించి గ్రామాల్లో సరఫరా చేస్తున్నారు. మిగతా గ్రామాల్లో పాత ట్యాంకులకు నీటిని పంపింగ్‌ చేసి ఇళ్లలోకి సరఫరా చేస్తున్నారు. దాదాపు పెద్దగ్రామాలకు రోజు ల క్ష లీటర్ల చొప్పున సరఫరా చేస్తుంటే చిన్న గ్రామాలకు 50వేల లీటర్ల చొప్పున సరఫరా చేస్తున్నారు. వేసవిలో సైతం ప్రజల దాహార్తిని తీరుస్తున్నారు. 

కల్వకుర్తి మున్సిపల్‌ పరిధిలో..  
వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో భూగర్భజలాలు ఏటా గణనీయంగా పడిపోయి మున్సిపల్‌ బోర్లే కాదు, ఇళ్లలో ఉండే బోర్లు సైతం ఎండిపోయాయి. దీంతో కల్వకుర్తి పట్టణంలో నీటి సమస్య తీవ్రంగా ఉండేది. అంతే కాకుండా దాదాపు 40వేల జనాభా ఉండడంతో నీటి సమస్య జఠిలంగా ఉండేది. దీంతో మున్సిపల్‌లో కొన్నేళ్ల నుంచి నీటి సరఫరా ట్యాంకర్ల ద్వారానే చేస్తున్నారు. నీటి సరఫరాకు రోజు రూ.లక్ష ట్యాంకర్లకే ఖర్చు పెట్టేవారు. సమస్య తీరేది కాదు. ప్రజలు ఎవరింటికి వారు ట్యాంకర్ల ద్వారా పోయించుకునే వారు.

నాలుగేళ్లలో ట్యాంకర్ల కోసం రూ.మూడు కోట్లపైనే వ్యయం చేశారని అంచనా. ఇక భగీరథ వచ్చిన తర్వాత పట్టణానికి నిత్యం 40లీక్షల లీటర్లు సరఫరా చేస్తున్నారు. ట్యాంకర్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో పాత ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు. వేసవి వస్తే రోడ్లపై, కాలనీలో ట్యాంకర్ల చప్పుడే ఉండేది. ఇప్పుడు ఆ సమస్య లేకుండా పోయింది. ఒక్కరోజు తప్పించి మరోరోజు నీటి సరఫరా అవుతుండడంతో పట్టణంలో వేసవిలో సైతం నీటి సమస్య లేకుండా ఉండడంతో ప్రజలు చాలా సంతోష పడుతున్నారు.

వేసవి కాలం అంతా.. సరఫరా
మరో రెండు నెలల పాటు వేసవి ఉంటుం ది. భగీరథ నీరు వేసవిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేయనున్నామని మిషన్‌ భగీరథ ఈఈ పు ల్లారెడ్డి తెలిపారు. దీంతో ఇక వేసవిలో నీటి సమస్య రాదు. గ్రా మాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికినట్లే. వేసవిలో సరఫరా చేస్తే ఇక వర్షాకాలం నల్లేరుమీద నడకలాంటిందే.
     
     

మరిన్ని వార్తలు