నిథమ్‌..ది బెస్ట్‌

18 Apr, 2019 08:04 IST|Sakshi

రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్‌  

జాతీయ స్థాయిలో 9వ ర్యాంక్‌  

ప్రకటించిన జీహెచ్‌ఆర్‌డీసీ  

గచ్చిబౌలి టెలికామ్‌నగర్‌లో 30 ఎకరాల్లో అక్టోబర్‌ 2004లో తొలుత అకాడమిక్‌ ఆపరేషన్స్‌ ప్రారంభించారు. అప్పటి సీఎం దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి చొరవతో జాతీయ స్థాయి విద్యాసంస్థను నెలకొల్పి నిర్మాణం చేపట్టారు. వైఎస్‌ సమక్షంలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ ఎంబీఏ, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సులతో పాటు స్వల్పకాలిక శిక్షణ కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిథమ్‌లో 650 మంది విద్యార్థులు ఉన్నారు.  

రాయదుర్గం :గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌ (నిథమ్‌) పర్యాటక, ఆతిథ్య రంగంలో దేశంలోనే తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ప్రతిఏటా తన ర్యాంకును మెరుగుపర్చుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా మంగళవారం న్యూఢిల్లీలోని గ్లోబల్‌ హ్యూమన్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌(జీహెచ్‌ఆర్‌డీసీ) ప్రకటించిన సర్వే ఫలితాల్లో మెరుగైన ర్యాంకులు సాధించింది. రాష్ట్ర స్థాయిలో 2వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 9వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. జీహెచ్‌ఆర్‌డీసీ ప్రతిఏటా పర్యాటక, ఆతిథ్య రంగంలోని విద్యాసంస్థల పనితీరు, విద్యార్థులు, అధ్యాపకులు, బోధన, ప్లేస్‌మెంట్స్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ర్యాంకులను ప్రకటిస్తోంది.      –

అవార్డులివీ... 
2019లో ఏషియా అరబ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ వార్షిక అవార్డు.  
2018లో మైస్‌ మార్కెటింగ్‌ డెస్టినేషన్‌ ద్వారా తైవాన్‌ ఇంటర్నేషనల్‌ అవార్డు.  
2017, 2018లో జీహెచ్‌ఆర్‌డీసీ సర్వేలో జాతీయ స్థాయిలో 10వ ర్యాంక్‌.  
2017లో రాష్ట్రంలో గ్రీన్‌ క్యాంపస్‌గా గుర్తింపు పొందిన తొలి విద్యా సంస్థ.  
2017–2018లో ‘ది వీక్‌’ సర్వేలో టాప్‌ ర్యాంక్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ ఇనిస్టిట్యూట్‌గా జాతీయ స్థాయిలో గుర్తింపు.   
2017, 2018లో ఎపిక్యూరస్‌ సంస్థ ద్వారా బెస్ట్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ ఇనిస్టిట్యూట్‌ అవార్డు.   
2017, 2018లో ‘ది వీక్‌’ మేగజైన్‌ ఉత్తమ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ విద్యాసంస్థగా గుర్తింపు.
2017, 2018లో ‘ది బిజినెస్‌ స్టాండర్డ్‌’ బి–స్కూల్‌ ర్యాంకింగ్‌లో ఉత్తమ విద్యాసంస్థగా గుర్తింపు.  

ఆదర్శంగా తీర్చిదిద్దాం 
నిథమ్‌ను ఆదర్శ విద్యాసంస్థగా తీర్చిదిద్దాం. క్రమశిక్షణ, విద్యాబోధన, పనితీరులో నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చాం. విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా పరీక్ష విధానంలో మార్పులు చేయడంతో పాటు మౌలిక వసతులు కల్పించాం. వీటన్నింటితోనే ర్యాంకులు మెరగవడం, అవార్డులు రావడం సాధ్యమైంది.  – నరేంద్రకుమార్, ప్రిన్సిపల్‌  

లక్ష్యం.. నంబర్‌ 1
నిథమ్‌ను దేశంలోనే నంబర్‌ వన్‌ ఇనిస్టిట్యూట్‌ గా తీర్చిదిద్దడమే మా లక్ష్యం. మరో రెండేళ్లలో అది సాధిస్తామనే నమ్మకం ఉంది.విద్యార్థులు, అధ్యాపకులు, అధికారులు, సిబ్బంది సమష్టి కృషితోనే ఈ ర్యాంకులు సాధ్యమయ్యాయి.  ఇప్పటికే కొత్తగాబేకరీ, చాకొలెట్‌ రూమ్‌  అందుబాటులోకి తెచ్చాం.  – డాక్టర్‌ ఎస్‌.చిన్నంరెడ్డి, డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు