తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది

20 May, 2015 02:58 IST|Sakshi
తల్లీ, కూతుళ్ల సెంటిమెంట్ కొట్టుకుపోయింది

81 శాతం వాటాల బదిలీ  చెల్లదు
 బయోలాజికల్- ఈ కంపెనీ కుటుంబ వివాదంపై హైకోర్టు

 
కుటుంబ ఆధ్వర్యంలో నడుస్తున్న బయోలాజికల్- ఈ (బీఈ) మార్గదర్శకుడి మరణంతో న్యాయ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. తల్లీకూతుళ్లు హద్దులు గీసుకుని చేస్తున్న ఈ యుద్ధంలో సెంటిమెంట్ కొట్టుకుపోయింది. వారసులెవరనే విషయంపై కోర్టులో తల్లీ, కూతుళ్లు తమంతట తాముగా దోషులుగా నిలబడి, ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు.
 
హైదరాబాద్: ప్రముఖ ఔషధ తయారీ కంపెనీ బయోలాజికల్- ఈ (బీఈ) కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ, కూతుళ్ల మధ్య సాగుతున్న వివాదంలో హైకోర్టు కీలక తీర్పునిచ్చిం ది. కంపెనీ డెరెక్టర్లుగా పూర్ణిమ, ఇందిరా, మహిమ చట్టబద్ధంగా నియమితులు కాలేదని తేల్చి చెప్పింది. బీఈ చైర్మన్, ఎండీ విజయకుమార్ దాట్ల పేరుతో ఉన్న 81 శాతం వాటాల బదిలీ చెల్లదని ప్రకటించింది. కంపెనీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తల్లి రేణుక దాట్ల, కుమార్తెలు పూర్ణిమ, ఇందిరా, మహిమ.. వివాదాలను పక్కనపెట్టాలని ఆదేశించింది. మూడో వ్యక్తికి జోక్యం చేసుకునే అవకాశమిస్తే, కంపెనీ పట్టాలు తప్పే ప్రమాదం ఉందని హెచ్చరిం చింది. తాత్కాలిక బోర్డ్ ఆఫ్ డెరైక్టర్లుగా రేణుక, ఆమె ముగ్గురు కుమార్తెలను నియమించిన కోర్టు, వీరిలో రేణుక ఈడీగా, మిగిలినవారు డెరైక్టర్లుగా ఉంటారని తెలిపింది. వారసులెవరనే  విషయంపై సివిల్ కోర్టులో ఉన్న వివాదం తేలేంత వరకు ఆయనకున్న 81శాతం వాటాలను బోర్డు ఎవరికీ బదలాయించరాదంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి ఇటీవల తీర్పు వెలువరించారు.
 
ఇదీ వివాదం...

బీఈ చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉన్న డాక్టర్ దాట్ల విజయకుమార్‌రాజు ఇటీవల మరణించారు. ఆయన మృతితో ఈ కంపెనీపై ఆధిపత్యం కోసం తల్లీ కూతుళ్ల మధ్య వివాదం తలెత్తింది. ఇదే సమయంలో ముగ్గురు కుమార్తెలు డెరైక్టర్లుగా నియమితులయ్యారు.  విజయకుమార్ రాజు పేరు మీద ఉన్న 81 శాతం వాటాను ముగ్గురు కుమార్తెల్లో ఒకరి పేరున బదలాయించుకున్నారు. వీటన్నింటిపై విజయకుమార్‌రాజు సతీమణి రేణుక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, ఇటీవల తీర్పు వెలువరిస్తూ, కంపెనీ ప్రయోజనాలనే సర్వోన్నతంగా భావిస్తూ తల్లీ, కూతుళ్లకే నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తున్నట్లు పేర్కొన్నారు. రేణుక మేనేజింగ్ డెరైక్టర్‌గా, ఏకాభిప్రాయంతో ఈ బోర్డు తగిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బోర్డు డెరైక్టర్ల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే, కంపెనీ లా బోర్డును ఆశ్రయించి ఉత్తర్వులు పొందవచ్చునని తెలిపారు. కంపెనీ లా బోర్డులో ఉన్న పిటిషన్‌పై నిర్ణయం వెలువడేంత వరకు ఈ తాత్కాలిక బోర్డు కొనసాగుతుందని, సివిల్ కోర్టులో వివాదం తేలేంత వరకు తమ వద్ద ఉన్న పిటిషన్‌ను కంపెనీ లా బోర్డు అలానే పెండింగ్‌లో ఉంచాలని ఆదేశించారు.
 
 

మరిన్ని వార్తలు